హైద్రాబాద్లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేని వాళ్ళు నంది అవార్డుల గురించి విమర్శలు చేస్తున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేని వాళ్ళు నంది అవార్డుల గురించి విమర్శలు చేస్తున్నారని ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల మూడేళ్ళకు నంది అవార్డులకు ప్రకటించింది. నంది అవార్డులపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు చేశారు.ఈ విమర్శలపై సోమవారం నాడు లోకేష్ ఘాటుగా స్పందించారు.
నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ అవార్డుల ఎంపిక కోసం నియమించిన జ్యూరీ కమిటీ సభ్యులతో పాటు ప్రభుత్వంపై కూడ విమర్శలు గుప్పించారు.
కులాలపరంగా అవార్డులను ప్రకటించారని కొందరు విమర్శలు చేశారు. సినీ పరిశ్రమపై ఈ అవార్డుల విషయమై నాలుగైదు రోజులుగా వాద, ప్రతివాదనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ విషయమై సోమవారం నాడు ఏపీ మంత్రి నారాలోకేష్ అమరావతిలోని అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఆధార్ కార్డు, ఓటరు కార్డులేని వాళ్ళు విమర్శలా
ఏపీలో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు కూడా ప్రత్యేక హోదా, నంది అవార్డులపై విమర్శలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. నంది అవార్డుల విషయాన్ని కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. 3 ఏళ్ళకు ఒకేసారి అవార్డులు ఇవ్వడాన్ని కూడ రాద్దాంతం చేస్తున్నారని లోకేష్ అన్నారు. హైద్రాబాద్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబు బాధపడ్డారు
నంది అవార్డుల విషయమై వస్తోన్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బాధపడ్డారని లోకేష్ గుర్తు చేశారు.నంది అవార్డుల జ్యూరీలో ఉన్న వాళ్ళు కూడ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.నంది అవార్డులపై విమర్శలు చేస్తోంది ఇద్దరు, ముగ్గురు మాత్రమేనని లోకేష్ గుర్తు చేశారు.

ధర్నా కోసం విమానాల్లో విజయవాడకు
ధర్నాలు నిర్వహించేందుకు ఫ్లైయిట్లలో విజయవాడకు వస్తున్నారని ఆయన పరోక్షంగా విపక్ష నేతలకు చురకలు అంటించారు. ఆంద్రాకు సంబంధం లేని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. అనవసరంగా రచ్చ చేయడం సరైందికాదన్నారు.

డిల్లీలో ధర్నాలు చేయాలి
ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తే ఏం ఉపయోగమని లోకేష్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేయాలని ఆయన ధర్నాలు నిర్వహించే పార్టీలకు సూచించారు. ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేక హోదా కల్పించే ప్రయోజనాలను ఇస్తామని కేంద్రం ఇచ్చిన హమీని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications