వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీద వైసీపీ మంత్రి పోలీస్ కంప్లైంట్ : విషయం ఇదే !!
నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీగా ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా తయారైన రఘురామ కృష్ణంరాజుపై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ వర్గ విబేధాలు సృష్టించి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని రఘురామ కృష్ణంరాజుపై ఆయన ఫిర్యాదు చేశారు.

పోడూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ రఘురామపై ఫిర్యాదు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం లోని పోడూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఫిర్యాదు చేసిన ఆయన ఎంపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని న్యూస్ డిబేట్ లలో తనను, తన కుమారుడిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు అని, నోటికొచ్చింది మాట్లాడుతున్నారని, వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.

పరువుకు భంగం కలిగిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన మంత్రి
రాజకీయ ప్రజా జీవితంలో విమర్శలు సహజమని పేర్కొన్న మంత్రి, ఒక అవకాశవాది వ్యక్తిగత స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారి వ్యక్తిత్వంపై దాడి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలుచుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. తమను దొంగలు అని సంబోధించడంపై మనస్థాపం చెందానని పేర్కొన్న ఆయన తన పరువుకు భంగం కలిగిస్తూ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పందులే గుంపులుగా వస్తాయి అంటూ రఘురామ వ్యాఖ్యలపై అసహనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి పేర్ని నాని, తాను కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిని ఉదహరిస్తూ పందులే గుంపులుగా వస్తాయి అంటూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించడంపై మంత్రి శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. తమపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం నిజాయితీపరులుగా ,సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో పేరు తెచ్చుకున్న తనపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నాడని ఆర్ఆర్ఆర్ పై నిప్పులు చెరిగారు.

వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం
ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన మద్దతుదారులతో మంత్రి అయిన తన దిష్టి బొమ్మను తగల బెట్టి , వర్గ వైషమ్యాలు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తన వ్యక్తిత్వానికి భంగం కలిగే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు . రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతో న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్న మంత్రి శ్రీరంగనాథరాజు రఘురామకృష్ణంరాజు తీరు చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. అందుకే తన వ్యక్తిత్వాన్ని అవమానించినందుకు ఆయనపై న్యాయపోరాటం చేయనున్నానని తెలిపారు మంత్రి శ్రీరంగనాథరాజు.












Click it and Unblock the Notifications