వరదలకు అమరావతి మునిగిపోతుందా ? మంత్రి నారాయణ జవాబు ఇదే..!
ఏపీ రాజధాని అమరావతి వరదలకు మునిగిపోతుందా ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తాజాగా చోటు చేసుకున్న రెండు సంఘటనలు. ఇందులో ఒకటి కృష్ణానది వరదలు కాగా.. రెండవది ప్రపంచ బ్యాంక్ బృందం రాజధానిలో చేసిన పర్యటనలో అడిగిన ప్రశ్న. ఈ రెండు కారణాలతో అమరావతి రాజధాని ముంపుపై రాష్ట్రంలో మరోసారి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ మంత్రి నారాయణ తొలిసారి ఈ అంశంపై స్పందించారు.
వరదల వల్ల అమరావతి మునిగిపోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందిస్తూ.. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అనవసర ప్రచారం నమ్మవద్దని తెలిపారు. అమరావతి చాలా సురక్షితంగా ఉందన్నారు. భవిష్యత్తులో కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు నారాయణ వెల్లడించారు.

మరోవైపు బుడమేరు వాగు వరద వల్ల కూడా అమరావతి రాజధానికి ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే రాజధానిలోనే ఉన్న కొండవీటి వాగు వల్ల కూడా ఇబ్బంది లేదన్నారు. కొండవీటి వాగు , పాలవాగు లపై త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు. తద్వారా అమరావతి పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లే అని నారాయణ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రపంచ బ్యాంక్ టీమ్ పర్యటన, కృష్ణానది వరదల తర్వాత జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లయింది.












Click it and Unblock the Notifications