జైలుకు వెళ్లే ముందు ప్రాక్టీస్: జగన్పై అయ్యన్న
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రైతు దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లే ముందు ప్రాక్టీస్ కోసమే జగన్ దీక్ష చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నారో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకే తెలియదని ఆయన శనివారంనాడు అన్నారు.
కాగా, జగన్ దీక్షపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్నాడు కాబట్టి జగన్ దీక్ష చేస్తున్నాడని ఆయన అన్నారు. రుణమాఫీలో పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు ఆయన తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని ఆయన శనివారం మీడియాతో అన్నారు.

రూ. 50 వేల లోపు రుణాలన్నీ మాఫీ అయ్యాయని ఆయన అన్నారు. జగన్ రుణమాఫీకి వ్యతిరేకంగా మాట్లాడారని, జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా రుణమాఫీకి వ్యతిరేకమని ఆయన అన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి రుణమాఫీపై మాట్లాడడమేమిటని ఆయన అడిగారు.
గుట్టుగా జీవితం సాగిస్తున్న రైతులను రోడ్డు మీదికి ఈడ్చారని కాంగ్రెసు మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యోగ నిద్రలో ఉందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.












Click it and Unblock the Notifications