జగన్ తో ముగిసిన మంత్రుల భేటీ-కాసేపట్లో ఉద్యోగులకు క్లారిటీ- 27 శాతానికి ఫిట్ మెంట్ ?
ఏపీలో పీఆర్సీ వివాదం ముగిసినట్లేనని ప్రభుత్వం లీకులు ఇస్తున్న తరుణంలో సీఎం జగన్ తో కొద్దిసేపటి క్రితం మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి మంత్రుల కమిటీ తీసుకెళ్లింది. ఈ చర్చల వివరాలను ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చించబోతోంది. అనంతరం పీఆర్సీ మార్పులతో పాటు సమ్మెపైనా ఓ ప్రకటన విడుదల అవుతుందని భావిస్తున్నారు.
Recommended Video
ఉద్యోగుల సమ్మెపై ఉత్కంఠ
ఏపీలో ఉద్యోగులు రేపు అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. నిన్నటివరకూ పీఆర్సీ సహా ఇతర డిమాండ్లపై మొండిగా వ్యవహరించిన ప్రభుత్వం నిన్న రాత్రి మాత్రం పీఆర్సీ సాధన సమితి నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ చర్చలు సానుకూలంగా జరిగినట్లు ఇటు ప్రభుత్వం తరఫున మంత్రుల కమిటీతో పాటు ఉద్యోగుల తరఫున స్టీరింగ్ కమిటీ కూడా ప్రకటించాయి. దీంతో ఉద్యోగులు సమ్మె విరమించే అవకాశముందని ప్రభుత్వం లీకులు ఇస్తోంది. అయితే ఉద్యోగులు మాత్రం ఇంకా ఏమీ తేలలేదని కౌంటర్లు ఇస్తున్నారు.
జగన్ తో మంత్రుల భేటీ
ఉద్యోగుల సమ్మెపై ఇవాళ తేలిపోతుందని ఉదయం నుంచీ ప్రభుత్వం నియమించిన కమిటీలో ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినాని లీకులు ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు చెప్పినట్లుగానే సీఎం జగన్ తో మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల కోర్కెలను ఆయన ముందుపెట్టారు. వాటిపై జగన్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రులు చెప్తున్నారు. అయితే ఈ వివరాలను తిరిగి ఉద్యోగుల ముందు ఉంచి వీటిపై తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. ఏకాభిప్రాయం కుదిరితే మాత్రం ఈ సాయంత్రానికి ఓ ప్రకటన వచ్చే అవకాశముంది.
ఉద్యోగులతో మళ్లీ మంత్రుల భేటీ
సీఎం జగన్ తో జరిపిన చర్చల్లో లేవనెత్తిన అంశాలు, వాటికి జగన్ స్పందన వంటి అంశాలను మంత్రులు ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు ఉద్యోగసంఘాల పీఆర్సీ సాధన సమితితో మంత్రులు భేటీ అవుతున్నారు. పీఆర్సీ ఫిట్ మెంట్ శాతం మివహా మిగిలిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఈ ఒక్క అంశంపైనా వెనక్కి తగ్గితే సమ్మె విరమించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది చర్చలు జరిపేందుకు ఉద్యోగసంఘాలతో సచివాలయంలో మంత్రులు సమావేశమవుతున్నారు.
27 శాతానికి ఫిట్ మెంట్ ?
ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులకు అధికారుల కమిటీ ఇచ్చిన 14 శాతం కంటే ఎక్కువగా 23 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. అయితే దీనిపైనే ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ తరహాలో 30 శాతం ఫిట్ మెంట్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా చూసినా కనీసం 27 శాతం ఫిట్ మెంట్ కు పట్టుబడుతున్నారు. దీంతో ఈ నాలుగుశాతం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు కనిపిస్దున్నాయి. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాలుగుశాతం ఫిట్ మెంట్ పెంచేందుకు జగన్ సానుకూలంగా ఉన్నారని, దీని వల్ల ప్రభుత్వంపై రూ.5600 కోట్ల మేర భారం పడుతుందని తేల్చిచెప్పారు. దీంతో ఫిట్ మెంట్ శాతం పెరగడం లాంఛనమేనని తెలుస్తోంది. ఈ డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరిస్తే ఉద్యోగులు సమ్మెపై వెనక్కి తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.