ఇకపై గంటా, నారాయణ వియ్యంకులు: పెళ్లికి హాజరు కానున్న చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు శుక్రవారంతో వియ్యంకులుగా మారనున్నారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో వీరిద్దరి మధ్య సంబంధాలున్నప్పటికీ, ఈరోజు నుంచి బంధువులుగా మారుతున్నారు.
నారాయణ కూతురు శరణి, గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజల వివాహం శుక్రవారం నెల్లూరులోని నారాయణ వైద్య విద్యాసంస్ధలు ప్రాంగణంలో అంగరంగవైభవంగా జరగనుంది. ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆ తర్వాత నారాయణ ఆధ్వర్యంలో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇటీవలే వీరి వివాహానికి సంబంధించిన సంగీత్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.

ఏపీలో రాజకీయ నాయకలు కుటుంబాలు మధ్య జరుగుతున్న వివాహాలు మరింతగా పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి, కొనకళ్ల నారాయణ వియ్యంకులు కాబోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేఈ కృష్ణమూర్తి ఏపీ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న కొనకళ్ల నారాయణ తెలుగుదేశం పార్టీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గతేడాది వరకు ఏపీ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కేఈ కృష్ణమూర్తి పనిచేశారు.
ఇటీవలే ఆ పదవికి కొనకళ్ల నారాయణ ఎన్నికయ్యారు. దీంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన తమ్ముడు జయచంద్రుడి కుమార్తె మహితను, కొనకళ్ల నారాయణ రెండవ కుమారుడు చైతన్యకు ఇస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన:
శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
* ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్లో పొదలకూరుకు చేరుకుంటారు. అక్కడ రూ.61 కోట్లతో నిర్మించే కండలేరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. పొదలకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదాపు 2గంటల పాటు అక్కడే గడుపుతారు.
* అనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు సంగం బ్యారేజీకి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ నిర్మిస్తున్న సంగం బ్యారేజీ పనులను పరిశీలిస్తారు. కావలి కాలువ పరిస్థితిని తెలుసుకుంటారు. సుమారు అర్ధగంటసేపు సమయం కేటాయించారు.
* మధ్యాహ్నం ఒంటిగంటకు సంగంలో బయలు దేరి హెలికాప్టర్ ద్వారా నెల్లూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. పోలీసు అతిథిగృహంలో మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. కొంత విశ్రాంతి అనంతరం నెల్లూరు బ్యారేజీ సందర్శనకు వెళతారు. బ్యారేజీ పనులను పరిశీలించి తగిన సూచనలు చేస్తారు.
* అనంతరం ఉమేష్చంద్ర సమావేశ మందిరంలో పరిమిత సంఖ్యలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, సాగునీరు పరిస్థితిని సమీక్షిస్తారు.
* అనంతరం అవకాశం ఉంటే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. ఇది ఇంకా ఖరారు కాలేదు.
* అక్కడి నుంచి తిరిగి పోలీసు అతిథి గృహానికి వెళ్లి సేదతీరతారు. సాయంత్రం మంత్రి నారాయణ కూతురు వివాహానికి హాజరవుతారు. రాత్రి తిరిగి పోలీసు అతిథి గృహంలోనే బస చేస్తారు.
* శనివారం ఉదయం రేణిగుంట వెళ్లి విమానంలో విజయవాడకు వెళతారు.












Click it and Unblock the Notifications