ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల...ఆటాడుకుందాం రా!...ఈ నెల 24 నుంచి
అమరావతి:తాజా రాజకీయ పరిణామాలతో బుర్ర వేడెక్కిపోయివున్న ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు అవకాశం కల్పించాలని శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయించారు. అందుకే ఈ ప్రజా ప్రతినిధులందరికి క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 24 నుంచి 27 వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యులకు క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన మంగళవారం ఆయన ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ నెల 24 నుంచి 26 వరకు ఆటల పోటీలు నిర్వహిస్తారు.
మొత్తం 10 రకాల ఆటల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అనంతరం 27న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు సంబంధించి జరిగిన ప్రత్యేక సమావేశంలో మండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, అయ్యన్న, కొల్లు రవీంద్ర, చీఫ్విప్ రఘునాథరెడ్డి, విప్ కూన రవికుమార్, ఇన్ చార్జ్ సెక్రటరీ విజయరాజు తదిదరులు పాల్గొన్నారు.