ఓటమికి వైసీపీలో బాధ్యులెవరు - ఆ నిర్ణయమే దెబ్బ కొట్టిందా..!?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారి పైన చర్యల దిశగా రంగం సిద్దమవుతోంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మంత్రులకు అభ్యర్దుల గెలుపు బాధ్యతను సీఎం జగన్ అప్పగించారు. మంత్రులు- ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలుపొందిన వైసీపీ..పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. అందునా ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరాంధ్రతో పాటుగా కంచుకోటగా భావించే తూర్పు రాయలసీమలొ ఓటమితో ఏం జరిగిందనే చర్చ పార్టీలో మొదలైంది. దీనికి బాధ్యులు ఎవరనేది అంతర్మధనం ప్రారంభమైంది.

వైసీపీ ఓటమి వెనుక
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైసీపీ ముఖ్య నేతలకు రుచించం లేదు. ఇంత బలంగా ఉన్న సమయంలో ఓటమి ఏంటనే అంతర్మధనం మొదలైంది. తమ విజయాన్ని టీడీపీ అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటూ ప్రచారం ప్రారంభించింది. ఉత్తరాంధ్రలో వైసీపీ ఇంఛార్జ్ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అభ్యర్ది గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. పలు సమావేశాలు నిర్వహించారు. మంత్రులకు సీఎం జగన్ బాధ్యతలు కేటాయించారు. వీటిని సెమీ ఫైనల్స్ గా చూడాలని సుబ్బారెడ్డి సూచించారు. కానీ, ఉత్తరాంధ్రలో టీడీపీని పూర్తిగా బలహీనపర్చామని వైసీపీ భావిస్తున్న వేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రాయలసీమలోనూ మంత్రులు పలుమార్లు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచనలు చేసారు. కానీ ,అక్కడ ఫలితం వ్యతిరేకంగా వచ్చింది.

టీడీపీకి కలిసొచ్చిన పీడీఎఫ్ తో బంధం
మంత్రులు..ఎమ్మెల్యే మధ్య సమన్వయం లోపం ఉందని క్షేత్ర స్థాయి నేతలు చెబుతున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు పీడీఎఫ్ తో ఒప్పందం చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. ఆ నిర్ణయం టీడీపీకి బాగా కలిసి వచ్చింది. కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అతి విశ్వసంతో కనిపించారు. ఎక్కడా పట్టభద్రుల దగ్గరకు వెళ్లి మద్దతు కోరిన సందర్భాలు చాలా తక్కువగా కనిపించాయి. ఓటర్లను చేర్చటం.. తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవటంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. అంతా మంత్రులే చూసుకుంటారనే విధంగా వ్యవహరించారు. ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం లేదు. ఉత్తరాంధ్రలో నేతల మధ్య ఐక్యత లేకపోవటం స్పష్టంగా కనిపించింది.

ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరిస్తారా
రాయలసీమలో టీడీపీ నేతలు కలసికట్టుగా పని చేసారు. నియోజవర్గాల వారీగా బాధ్యతలు తీసుకున్నారు. వైసీపీ నేతల్లో ఆ సీరియస్ నెస్ లేకపోవటం నష్టం చేసింది. అనేక మంది వైసీపీ మద్దతు దారులకు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓట్లు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కలిసి కట్టుగా పార్టీ శ్రేణులతో కలిసి పని చేసారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలంటే తమకు సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి..మంత్రులే అంతా చూసుకుంటారనే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించారని చెబుతున్నారు. మరి..ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారు. మంత్రులను బాధ్యులను చేస్తారా.. ఈ ఫలితాలతో పార్టీ నేతలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వేళ..ఎటువంటి హెచ్చరికలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications