Amaravati: అమరావతి రైతుల్లో అనుమానాలు ? మంత్రి నారాయణ క్లారిటీ ఇదే..!
అమరావతిలో కూటమి సర్కార్ చేపట్టబోతున్న రెండో విడత భూసేకరణ విషయంలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రెండు విషయాల్లో వారు ప్రభుత్వ ప్రతిపాదనలపై అభ్యంతరాలు చెబుతున్నారు. ఇందులో ఒకటి ముందుగా భూములిచ్చిన తమకు న్యాయం చేయకుండా రెండో విడత భూసేకరణకు వెళ్లడం ఒకటైతే, తొలి విడతలో భూసమీకరణ చేసి, ఇప్పుడు రెండో విడతలో భూసేకరణ చేయడం ఏంటనే ప్రశ్న మరొకటి. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోంది.
ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని వ్యవహారాల్ని చూస్తున్న మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని నారాయణ తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన సూచించారు. రైతుల భూముల ధర నిలవాలన్నా....పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు.

అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు.స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జనాభా పెరుగుతుందని తెలిపారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూసమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని నారాయణ స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయని, భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామన్నారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ మరోసారి స్పష్టం చేశారు.
రాజధాని ప్రాంతంలో రెండో విడతగా 44 వేల ఎకరాల భూముల్ని సేకరించేందుకు సీఆర్డీయే సిద్దమవుతోందంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో వార్తలొచ్చాయి. దీంతో తొలి విడత భూములిచ్చిన రైతులతో పాటు రెండో విడత భూసేకరణ చేసే ప్రాంతాల రైతుల్లోనూ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే రెండో విడతలో భూసేకరణ చేయాలా లేక సమీకరణ చేయాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. ఎయిర్ పోర్టు వరకూ భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications