ఏపీకి మరో వరమిచ్చిన కేంద్రం.. యూత్ కోసం ఆ కొత్త డైరెక్టరేట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో వరం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కోసం ప్రత్యేక రాష్ట్ర డైరెక్టరేట్ను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ కొత్త డైరెక్టరేట్ కేటాయించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్సీసీ డైరెక్టరేట్ల సంఖ్య 17 నుంచి 19కి పెరగనుంది.
కొత్త డైరెక్టరేట్ ఏర్పాటుతో ఏపీలో సమర్ధవంతంగా ఎన్సీసీ
ఎన్సీసీ హెడ్క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యార్థులు మరియు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. కొత్త డైరెక్టరేట్ ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్సీసీ యూనిట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

విస్తృత స్థాయిలో శిక్షణా కార్యక్రమాల విస్తరణకు ఛాన్స్
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఈ కొత్త నిర్ణయం విస్తృత స్థాయిలో శిక్షణా కార్యక్రమాలను విస్తరించడానికి దోహదపడుతుంది.ఎన్సీసీ అనేది దేశంలో యువతను క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలతో ముందుకు నడిపించే సంస్థ. 1948లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది క్యాడెట్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఎన్సీసీ తో అనేక లాభాలు
గత కొన్ని సంవత్సరాల్లోనే క్యాడెట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు శారీరక శిక్షణ, సైనిక శిక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలు, సాహస కార్యకలాపాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా, ఉద్యోగ అవకాశాలు, సైనిక రంగంలోకి ప్రవేశం వంటి అనేక లాభాలను కూడా అందిస్తుంది.
కొత్త డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం
ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త డైరెక్టరేట్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం మధ్య మంచి సమన్వయం ఏర్పడి, యువతకు మరిన్ని మౌలిక సదుపాయాలు అందించవచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త డైరెక్టరేట్ ద్వారా ప్రతి జిల్లా స్థాయిలో ఎన్సీసీ కార్యకలాపాలు సులభంగా నిర్వహించడం, ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోవడం, శిక్షణా శిబిరాలు, క్యాంపులు ఎక్కువ సంఖ్యలో నిర్వహించడం సాధ్యమవుతుంది.
రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన మరో కీలక గుర్తింపు
ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన మరో కీలక గుర్తింపుగా పరిగణించవచ్చు. రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధి చెందడంతో పాటు, యువతను భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్త యూనిట్లు ప్రారంభించడం, శిక్షణా అధికారులను నియమించడం వంటి పనులు త్వరగా చేపట్టనున్నారు.













Click it and Unblock the Notifications