ఎవరు ట్యాప్ చేయించారు?: 12 టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ నోటీసు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోతు తేల్చే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కారు దూకుడు పెంచింది. ట్యాపింగ్కు సంబంధించి ఏపీలో నమోదైన కేసుల పైన ఏర్పాటైన సిట్ టెలికం ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసింది. సోమవారం విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఏపీ ప్రభుత్వానికి చెందిన పలువురు ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏపీ సిట్ అధికారులు శనివారం ఉదయం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లన్నింటికీ నోటీసులు జారీ చేశారు.
ఏపీకి చెందిన 120 మంది ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని, మరో 27 నెంబర్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు తమకు అనుమానం ఉందని వీటికి సంబంధించిన వివరాలను అందజేయాలని ఆ నోటీసుల్లో కోరినట్లుగా తెలుస్తోంది.
లిఖితపూర్వకంగా అనుమతి లేఖలు రాసి దీనికి పాల్పడ్డారా? లేదా ట్యాపింగ్కు పాల్పడిన తర్వాత అనుమతులు పొందారా? తదితర విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం 11 గంటల కల్లా విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో వివరాలను అందజేయాలని అందులో ఆదేశించినట్లు తెలిసింది.
ఏ ప్రభుత్వ అధికారి, ఏ కేసుకు సంబంధించి ఏ ఫోన్ నెంబర్ను ట్యాప్ చేయాలని అడిగారని, అందులో తాము ఇచ్చిన జాబితాలోని నెంబర్లు ఉన్నాయా, ఉంటే ఆ నెంబర్లను ట్యాప్ చేయాలని కోరిన అధికారి ఎవరు, లిఖితపూర్వకంగా కోరారా లేక మౌఖికంగా ఆదేశించారా అంటూ అందులో ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది.
మొత్తం 12 టెలికం కంపెనీలకు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. 90 రోజుల సమాచారం ఇవ్వాలని మరికొందరు సర్వీస్ ప్రొవైడర్లకు చెప్పారని తెలుస్తోంది. కాగా, టెలికాం ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేయడంతో.. రెండు రాష్ట్రాల మధ్య వివాదం, తమ మెడకు చుట్టుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.