'ఒలింపిక్' రగడ: గల్లా జయదేవ్తో జెసి తనయుడి ఢీ!
న్యూఢిల్లీ: ఏపీలో తెలుగుదేశం పార్టీ యువ నేతలు ఏపీ ఒలింపిక్ సంఘం పైన సిగపట్లు పట్టుకుంటున్నారు! గతంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ల మధ్య పోరు రసకందాయంగా కనిపించింది.
వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించిన ఇరువర్గాలు తమ సంఘమే నిజమైనది ఓ వర్గం అంటే, కాదు తమదే నిజమైన సంఘమని మరో వర్గం మీడియాకు ఎక్కాయి. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. ఆ వివాదం ఎట్టకేలకు సమసిపోయింది.
తాజాగా ఈ ఒలింపిక్ ఫైట్లోకి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి వచ్చారు. గల్లా జయదేవ్ను ఢీకొట్టేందుకే సిద్ధపడుతున్న పవన్ రెడ్డి.. తమదే నిజమైన ఒలింపిక్ సంఘమని ప్రకటించారు. గల్లా జయదేవ్ నేతృత్వంలోని సంఘాన్నే అధికారిక సంఘంగా గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) జారీ చేసిన ఉత్తర్వులను పవన్ రెడ్డి సవాల్ చేశారు.
ఈ మేరకు ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని పవన్ రెడ్డి సోమవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో పవన్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్లో గల్లా జయదేవ్ పైన ఆయన ఆరోపణలు చేశారు.
ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్తో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని గల్లా జయదేవ్ ఏపీ ఒలింపిక్ సంఘాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ ఆధ్వర్యంలోని సంఘమే అసలైనదని కూడా పవన్ రెడ్డి చెప్పారు.
తమ సంఘంలోని ఓ సభ్యుడు, మరికొందరితో కలిసి గల్లా జయదేవ్ కుట్ర పన్ని తమ సంఘం పేరుతోనే మరో సంఘం ఏర్పాటు చేశారని పవన్ రెడ్డి ఆరోపించారు. రామచంద్రన్ కుమారుడు గల్లా జయదేవ్ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారని, ఈ కారణంగానే జయదేవ్కు రామచంద్రన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.