వివాదాస్పద నిర్ణయం: రిలయన్స్కు ఆ బాధ్యతలు.. బాబు నిర్ణయంతో పేదోళ్లకు దెబ్బే?
విలేజ్ మాల్స్ లో మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకే సరుకులు దొరికేలా చూస్తామన్నారు.
Recommended Video
విజయవాడ: సంక్షేమ పథకాల బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వాలు.. మెల్లి మెల్లిగా ఒక్కో రంగం నుంచి జారుకుంటున్నాయి. ఇప్పటికే విద్యా, వైద్య వ్యవస్థలను నీరుగార్చి పేదవాడిని మరింత అణగదొక్కిన ప్రభుత్వాలు.. ఇప్పుడు తినే తిండి మీద కూడా దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నాయి.
హెరిటేజ్ రిటైల్ను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గ్రూప్!
హైటెక్ బాబుగా.. అభివృద్దికి కేరాఫ్గా తనను తాను పరిచయం చేసుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలోని పల్లెలకు మాల్స్ ను పరిచయం చేయబోతున్నారట. ఇంకేముంది! చిన్నాచితకా వ్యాపారస్తులంతా ఈ దెబ్బకు బిచాణా ఎత్తేయాల్సిందే. రింగ్ రోడ్డులు, ఆకాశాన్ని తాకే భవనాలే అభివృద్దికి పర్యాయ పదం అయినచోట పేదవాని సంక్షేమం ఇప్పుడు గాల్లో దీపం లాగే తయారైంది.
రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపుకు అప్పగింత:
కూలీ నాలీ చేసుకునే పేద కుటుంబాలకు ఇప్పటిదాకా రేషన్ దుకాణాలు కొంత భరోసాగా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ప్రభుత్వం ఆ బాధ్యతను కార్పోరేట్లకు కట్టుబెట్టే దిశగా కదులుతుండటంతో.. మున్ముందు రేషన్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ఏపీలో చౌక ధరల దుకాణాలకు వస్తువులు సరఫరా చేసే బాధ్యతను రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపుకు కట్టబెట్టబోతున్నట్లు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా ప్రకటించారు.
10జిల్లాల్లో రిలయన్స్ 3జిల్లాల్లో ఫ్యూచర్ గ్రూప్:
ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి పుల్లారావు ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 10జిల్లాల్లో రిలయన్స్, 3జిల్లాల్లో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు రేషన్ దుకాణాలకు సరుకులను సరఫరా చేస్తాయన్నారు.
ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా గుంటూరు అర్బన్ పరిధిలో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేసి పంచదార, కందిపప్పు, కిరోసిన్ వంటి వాటిని ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. విలేజ్ మాల్స్ లో మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకే సరుకులు దొరికేలా చూస్తామన్నారు.
ఉదయం 8గం. నుంచి మధ్యాహ్నాం 12గం. వరకు, తిరిగి సాయంత్రం 4గం. నుంచి రాత్రి 8గం. వరకు రేషన్ దుకాణాల్లో డీలర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సబబేనా?:
రేషన్ దుకాణాలకు సరుకుల సరఫరాను కార్పోరేట్ కంపెనీలకు అప్పగించడమనేది అనాలోచిత చర్యే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు-రేషన్ దుకాణాలకు మధ్య సమన్వయం ఏర్పరిస్తే సరుకుల ధరలు తగ్గుతాయి కానీ కార్పోరేట్ల నుంచి సరుకుల కొనుగోలు చేయడమంటనే ప్రశ్న తలెత్తుతోంది. దీనివల్ల సరుకుల ధరలు పెరిగిపోయి, చౌక ధరల దుకాణాలు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటున్నారు.
చిన్నాచితకా వ్యాపారులకు దెబ్బే:
విలేజ్ మాల్స్ ప్రవేశంతో గ్రామాల్లో ఉన్న కిరాణా షాపులకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. మాల్స్ లోనే అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండే అవకాశం ఉండటంతో.. చాలామంది అక్కడినుంచే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల గ్రామాల్లోని వైశ్య వ్యాపారులు సహా చిన్నాచితకా వ్యాపారులు దెబ్బతింటారు.
దేన్ని వదలరా?:
దేశంలోని ప్రతీ రంగానికి రిలయన్స్ వేగంగా విస్తరిస్తోంది. ప్రజా సంక్షేమం నుంచి క్రమక్రమంగా ప్రభుత్వాలు జారుకుంటుంటే ఆ స్థానాన్ని రిలయన్స్ ఆక్రమిస్తోంది. పైసాకు రెండు పైసల లాభం లేనిదే ఏ పని చేయని కార్పోరేట్ కంపెనీలు.. చౌక ధరలకు సరుకులను ఇస్తామనడం నమ్మశక్యంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తాత్కాళికంగా చౌక ధరలకే సరుకులు అందించినా.. మున్ముందు కార్పోరేట్ స్వభావం బయటపడకమానదంటున్నారు.
ఫ్యూచర్ గ్రూపులో వాటాలు ఉన్నందుకే:
సీఎం చంద్రబాబు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ను ఫ్యూచర్ గ్రూపుకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన కుటుంబానికి వాటాలున్నాయి. ఆ కారణంతోనే ఇప్పుడు రేషన్ దుకాణాల సరఫరాను ఫ్యూచర్ గ్రూపుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారని చెబుతోంది. ఇక చంద్రబాబుకు సన్నిహితుడైన రామోజీరావుకు రిలయన్స్ చాలా దగ్గర. ఆవిధంగా చంద్రబాబును అడ్డుపెట్టుకుని తమ వ్యాపారాలను విస్తరించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.