పవన్ స్పెషల్ ఫ్లైట్ కు అనుమతివ్వొద్దు-ఎయిర్ పోర్టు అధికారుల్ని కోరిన పోలీసులు-బేగంపేటలో బ్రేక్..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాంలో ఉదయం సీఐడీ మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసింది. నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును సాయంత్రం వరకూ ప్రయాణించి విజయవాడకు తీసుకొచ్చింది. కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసేందుకు విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు.
చంద్రబాబు అరెస్టు, ఏసీబీ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు భారీ ఎత్తున బందోబస్తు చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబును కలిసేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వస్తున్న పవన్ కళ్యాణ్ ను అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఎయిర్ పోర్టు అధికారులకు కీలక విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చే పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వొద్దని ఎయిర్ పోర్టు అధికారుల్ని విజయవాడ పోలీసులు కోరారు. ఈ మేరకు శాంతి భద్రతల అంశాన్ని ప్రస్తావిస్తూ విజ్ఞప్తి చేసారు. చంద్రబాబును కోర్టు వద్ద కలిసేందుకు కేవలం ఆయన కుటుంబ సభ్యులైన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కు మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.
కాబట్టి విజయవాడలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పవన్ కళ్యాణ్ విమానాన్ని అడ్డుకోవాలని ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పవన్ విమానం టేకాఫ్ కాకుండా బేగంపేటలోనే పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications