ఏపీ పోలీసుల అరుదైన ఘనత - దేశంలోనే నంబర్ 1 - అవార్డుల పంట - సీఎం జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో పోలీస్ శాఖల్లో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డుల్లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించింది. 'పోలీస్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్' విభాగంలో మొత్తం 84 అవార్డులకుగానూ ఏకంగా 48 అవార్డులను కైవసం చేసుకుంది.

తెలంగాణకు ఒకటే..
టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడం ఏపీ పోలీసులకు ఇది రెండోసారి. తాజా స్కోచ్ అవార్డుల్లో ఏపీకి రికార్డు స్థాయిలో 48 అవార్డులు దక్కగా, కేరళ- 9, మహారాష్ట్ర- 4, పశ్చిమ బెంగాల్- 4, తెలంగాణ- 1, తమిళనాడు- 1 అవార్డులను దక్కించుకున్నాయి. తాజాగా దక్కిన 48 అవార్డులతో కలిపి ఈ ఏడాది ఏపీ పోలీసులకు మొత్తం 85 పురస్కారాలు దక్కినట్లయింది. వివరాల్లోకి వెళితే..

‘దిశ’ సేవలకూ అవార్డులు..
మహిళా రక్షణ కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన దిశ చట్టం, దాని సంబంధిత విభాగాల్లో అందిస్తున్న టెక్నాలజీ సేవలకుగాను 5 అవార్డులను ఏపీ పోలీసులు సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్రజల కోసం 87 సేవలతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్కు గాను అవార్డు లభించింది. ఇక కోవిడ్ సమయంలో అందించిన, అందిస్తున్న మెరుగైన సంక్షేమానికి గాను 3 అవార్డులు, టెక్నికల్ విభాగంలో- 13 అవార్డులు, సీఐడీ- 4, కమ్యూనికేషన్- 3, విజయవాడ, కర్నూల్ జిల్లాలకు- 3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలకు- 2, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు (అర్బన్), గుంటూరు (రూరల్), కృష్ణ జిల్లాలకు- 1 అవార్డులు లభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిలో రికార్డ్ స్థాయిలో 85 అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగంగా ఏపీ పోలీసు శాఖ నిలిచింది.

పోలీసులకు సీఎం అభినందనలు..
జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న ఏపీ పోలీసు శాఖ విజేతలందరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో, త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. సీఎం జగన్ పోలీసులకు, పోలీస్ శాఖకు అందిస్తోన్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధించగలిగామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications