సాక్షికి కూడా ఎపి పోలీసుల నోటీస్: కెసిఆర్కు దమ్ముందా అని పల్లె
విశాఖపట్నం: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టీన్యూస్తో పాటు సాక్షి టీవీకి కూడా నోటీసులు ఇచ్చామని విశాఖ శాంతిభద్రతల డీసీపీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. 1995 కేబుల్ నెట్వర్క్ నియంత్రణా సెక్షన్ 19 ప్రకారం నోటీసులు ఇచ్చామని ఆయన ఎబిఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు.
దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు సవాల్ విసిరారు. తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి కేసు నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడ్డామని ప్రచారం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోదని ఆయన శనివారం అనంతపురంలో అన్నారు. అయితే, ఆ వ్యవహారంపై ఎసిబి కేసు నమోదుచేస్తే ఎలా అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేసును ఎన్నికల కమిషన్ పర్యవేక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన చానెళ్లు, కథనాలను అందించిన పత్రికలకు మాత్రమే నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు. చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేసినందుకే టీ న్యూస్ చానెల్కు నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే దమ్ము లేదా అని ఆయన టీ న్యూస్ చానెల్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ టీవీ చానెల్ ప్రసారాలపై ఏ విధమైన ఆంక్షలు విధించలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.