బీసీ -కాపులతో కొత్త రాజకీయ పార్టీ.. ?మళ్లీ తెరపైకి ముద్రగడ: మారుతున్న ఈక్వేషన్స్
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తెలంగాణ కంటే కూడా ఏపీ రాజకీయాలపైనే తెలుగు రాష్ట్ర ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ప్రధానంగా కుల రాజకీయాలు ఎక్కువగా నడుస్తాయనేది బహిరంగ రహస్యమే. ఇందుకు తగ్గట్టుగానే నాయకుల వ్యూహాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా బీసీలంతా కలిసి ఓ సరికొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురి మద్దతు కోసం బీసీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ ప్రద్మనాభంతో భేటీ అయ్యాయి బీసీ సంఘాలు.

ముద్రగడ పద్మనాభంను కలిసిన బీసీ నేతలు
కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కులప్రాతిపదికన మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అంటే బీసీల పార్టీగా ముద్రపడిన చాలామంది అది కమ్మ సామాజిక పార్టీగానే గుర్తిస్తారు. తాజాగా బీసీ సంఘాల నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కలిశారు. కొన్ని గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టేందుకు ముందు అన్ని జిల్లాల బీసీ నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించాలని సూచించారట. వారిలో ఎంతమంది కొత్త పార్టీకి మద్దతుగా నిలిచి కలిసి వస్తారో ముందుగా తెలుసుకోమని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత అడుగులు ముందుకు వేయాలని ముద్రగడ సూచించినట్లు తెలుస్తోంది.

బీసీ-కాపుల ఈక్వేషన్
ఆంధ్రప్రదేశ్లో బీసీలు 52శాతంగా ఉండగా... కాపులు 35 శాతంకు పైగా ఉన్నారు. బీసీలు కాపులు కలిసి ఒకే రాజకీయ వేదికపైకి వస్తే అధికారం చేజిక్కించుకోవడం సాధ్యపడుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇదే విషయాన్ని ముద్రగడ పద్మనాభంకు వివరించిన బీసీ సంఘాల నాయకులు... ముద్రగడ మద్దతును కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తమ ఆప్తులతో, వర్గీయులతో మాట్లాడి తన నిర్ణయం వెల్లడిస్తానని బీసీ సంఘ నాయకులకు ముద్రగడ చెప్పినట్లు సమాచారం.
Recommended Video

ముద్రగడకు బీజేపీ ఆహ్వానం
2019 ఎన్నికలకు ముందు వరకు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అంతా తానై నడిపించారు. ఆ సమయంలో ఆయన ఇంటికి స్వయంగా అప్పటి టీడీపీ బీసీ మంత్రులు, ఇతర బీసీ ఎమ్మెల్యేలు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేశారు. ఒకానొక సమయంలో కాపు ఉద్యమం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఆసమయంలోనే ముద్రగడపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఉద్యమ నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ముద్రగడ వైసీపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఇక ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు పార్టీలో కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. అయితే తన నిర్ణయం ఏంటనేది మాత్రం ముద్రగడ చెప్పకుండా దాటవేశారు. ఈ క్రమంలోనే బీసీ-కాపుల రాజకీయ పార్టీ ఈక్వేషన్ తెరపైకి రావడంతో మరోసారి ముద్రగడ పేరు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది
మొత్తానికి బీసీ-కాపులు ఒకే వేదికపైకి వచ్చి రాజకీయం చేస్తే కచ్చితంగా ఏపీ రాజాకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు












Click it and Unblock the Notifications