ఏపీ రాజకీయాల్లో "మెగా" ట్విస్ట్ : టీడీపీ- జనసేన పొత్తుపై బీఆర్ఎస్ ఎఫెక్ట్..!!
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ - చంద్రబాబు మాత్రమే కాదు మెగా బ్రదర్స్ కీలకంగా మారుతున్నారు. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు పార్టీలతో పాటుగా వ్యక్తిగతంగానూ రాజకీయంగా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీని కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. అభ్యర్ధులను ఖరారు చేస్తూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకోబోతోంది.

ఏపీలో పొత్తుల పై బీఆర్ఎస్ ఎఫెక్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారు. దక్షిణాదిలో ఆయనకు కర్ణాటకలో మిత్రుడు దొరికారు. పొరుగు రాష్ట్రం ఏపీలోనూ రాజకీయంగా బలపడాలంటే అమలు చేయాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా..ఆ బాధ్యతలను ముగ్గురు నేతలకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధానంగా ఏపీలో ఎవరి మద్దతుతో బరిలోకి దిగాలనే అంశం పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా, ఇదే అంశం పైన స్పందించిన మంత్రి కేటీఆర్ సరైన సందర్భంలోనూ అన్నీ బయటకు వస్తాయని వ్యాఖ్యానించటం మరింత ఆసక్తిని పెంచింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు మరోసారి అధికారం దక్కకుండా చూడటమే తన లక్ష్యమని..అందుకోసం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్ ప్రకటించారు.

ఏపీలో మెగా బంధం కోసం ప్రయత్నాలు
దీంతో..టీడీపీ - జనసేన మధ్య మరోసారి పొత్తు ఖాయమనే వాదన రోజు రోజుకీ బలంగా వినిపిస్తోంది. టీడీపీ నేతలు అంతర్గతంగా పొత్తు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల నేతలు పొత్తు ఖాయమనే అభిప్రాయం తో ఉన్నారు. ఇదే సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. గాడ్ ఫాదర్ మీడియా సమావేశంలో తమ్ముడు పవన్ కు తన మద్దతు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కోసమే తాను రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయ్యానని చెబుతూ..రాష్ట్రాన్ని ఏలే అవకాశం పవన్ కు రావాలని ఆకాక్షించారు. తన మద్దతు తన తమ్ముడకు ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే, ఇప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీ పైన భిన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో మెగా బ్రదర్స్ తో కలిసి రాజకీయంగా అడుగులు వేయటం పైన టీఆర్ఎస్ లో చర్చ సాగుతోంది. బీజేపీతో పవన్ కళ్యాన్ పొత్తు కొనసాగుతోంది. కానీ, రెండు పార్టీల మధ్య అంత సఖ్యత లేదనేది ఓపెన్ సీక్రేట్.

పవన్ ఏ చంద్రుడి వైపు నిలుస్తారు
కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాన్ తెలంగాణలో బీజేపీకి దాదాపు దూరమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతిపాదించిన దివంగత ప్రధాని పీవీ కుమార్తె వాణీకి మద్దతు ప్రకటించారు. ఏపీలోని బీజేపీతో కలిసి నిర్వహించిన కార్యక్రమాలు లేవు. ఇప్పటికే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్ముకోవటానికి సిద్దమయ్యారని..పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలతో చంద్రబాబు పల్లకి మోయించటానికి ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. పవన్ వాటిని ఖండించారు. ఇక,టీడీపీతో పొత్తు సందర్భంలో సీట్ల ఖరారు పైనా సమస్యలు ఉంటాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, టీడీపీ చంద్రుడిని కాదని ఏపీ ప్రజలను గతంలో దూషించిన టీఆర్ఎస్ చంద్రుడితో కలిస్తే రాజకీయంగా లాభమా - నష్టమా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి.

ఆసక్తి కరంగా మారుతున్న పొత్తు రాజకీయం
కానీ, తెలంగాణలో స్థిర పడిన సీమాంధ్రులు టీఆర్ఎస్ కే మద్దతు పలుకుతున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, టీడీపీతో కాకుండా విడిగా పోటీలో నిలిచినా.. మరే పార్టీతో కలిసినా ఓట్లు చీలి జగన్ కు మేలు చేస్తుందనే వాదన ఉంది. ఇప్పుడు..మెగా బ్రదర్స్ మద్దతు ఉంటే ఏపీలో లాభపడే స్థాయిలో ఎదగవచ్చనేది టీఆర్ఎస్ నేతల అంచనా. ఇందు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని భిన్నాభిప్రాయల నడుమ పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. రెండు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ తో కలిసి వెళ్లే ఆలోచన చేస్తారా.. లేక, ఏపీలో టీడీపీతో పొత్తు ఖరారు చేస్తారా..ఇవన్నీ కాదని రెండు రాష్ట్రాల్లోనూ ఒంటిరి పోరుకే సిద్దపడతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications