ఏపీపై విస్తరిస్తోన్న రుతుపవనాలు: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని తాకిన అతి కొద్దిరోజుల్లోనే దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం ఉండొచ్చు. పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడొచ్చు.
ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఈదురుగాలులు సైతం బీభత్సాన్ని సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పలకరించాయి.

ఇదే పరిస్థితి.. నేడు కూడా కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణం కొంత చల్లగా మారుతుందని, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, అలాగే రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈదురుగాలులు వీస్తున్నప్పుడు గానీ, పిడుగులు పడుతున్నప్పుడు గానీ శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని ఎస్డీఎంఏ పేర్కొంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగవచ్చు. ప్రత్యేకించి విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.












Click it and Unblock the Notifications