సీఎం జగన్ ను లోకేష్ అధిగమిస్తారా - కడపలో ఏం జరుగుతోంది..!!
టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేశ్ కు రాజకీయంగా ఇది టర్నింగ్ పాయింట్. 400 రోజులు...నాలుగు వేల కిలో మీటర్ల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించారు. ఈ రోజు లోకేష్ యాత్ర 114వ రోజుకు చేరింది. రాయలసీమలో చివరగా కడప జిల్లాలో పర్యటన సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావటంతో ఇక్కడ ఆదరణ బాగా ఉందని చూపేందుకు జిల్లా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర వేళ ఏం జరుగుతోంది.
లోకేష్ యువగళం : నారా లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది. మధ్యలో తారకరత్న మరణం..స్థానిక సంస్థల ఎన్నికలు..మహానాడు కారణంగా స్వల్ప విరామం ఇచ్చినా..యధావిధిగా కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పొత్తులకు సిద్దం అవుతున్నారు. వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ వారాహి ద్వారా గోదావరి జిల్లాల్లో తన యాత్ర ప్రారంభించబోతున్నారు.

ఇటు లోకేష్ రాయలసీమ నుంచి కోస్తా జిల్లాల్లోకి ప్రవేశిస్తారు. లోకేష్ యాత్ర గతంలో పాదయాత్ర చేసిన నేతల కంటే భిన్నంగా సాగుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లోకేష్ ప్రజలతో మమేకం అవుతూ..తాము అధికారంలోకి వస్తే చేసే మేలు గురించి చెప్పాల్సిన సమయంలో వివాదాలకు ఎక్కువగా స్థానిక పార్టీ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
జగన్ రికార్డు లక్ష్యంగా : ముఖ్యమంత్రి జగన్ చేసిన రికార్డు పాదయాత్ర ను తాను బ్రేక్ చేయాలనేది లోకేష్ లక్ష్యం. ఇదే సమయంలో పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఎన్నికల్లో ఆశావాహులు..స్థానిక పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లోకి లోకేష్ యాత్ర ప్రవేశం దగ్గర నుంచి అన్ని రకాల బాధ్యతలు తీసుకుంటున్నారు. స్థానికంగా ముందుగా ఏర్పాటు చేసిన సంఘాలకు చెందిన వారితో లోకేష్ మాట్లాడుతున్నారు.

వారికి ఏం మాట్లాడాలో కూడా ముందుగానే నిర్వహాకులు చెప్పటం ద్వారా ఆర్గనైజింగ్ ప్రోగ్రాంగా చెప్పే అవకాశం కలుగుతోంది. సమస్యలు విన్న తరువాత లోకేష్ ఇస్తున్న హామీలు ఇవ్వటం మినహా.. వాటి అమలు సాధ్యాసాధ్యాలపైన ఆలోచే చేయటం లేదనే అభిప్రాయం ఉంది. తన తండ్రి పాదయాత్ర సమయంలో వ్యవహరించిన తీరుకు భిన్నంగా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
హామీలు..వివాదాలు : లోకేష్ పార్టీలో చంద్రబాబు తరువాతి స్థానంలో ఉన్నారు. పాదయాత్రలో భాగంగా అభ్యర్ధులను ఖరారు చేసినట్లుగా సంకేతాలు ఇవ్వటం..ఇప్పుడు తాను అభ్యర్ధులను ఖరారు చేయలేదని చెప్పటం పార్టీలో చర్చకు కారణమవుతోంది. అదే సమయంలో నియోజకవర్గాల్లో వర్గాలు ఉన్న చోట కొంత మందికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ప్రొద్దుటూరులో ప్రస్తుతం అదే చర్చ సాగుతోంది.
ఇక, వైసీపీ పైన ఎదురుదాడి వ్యూహం చేస్తున్నామనే ఆలోచనతో అసలు దారి పాదయాత్రలో తప్పుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ పాదయాత్ర తరహాలోనే పార్టీ స్ట్రాటజిస్టులు లోకేష్ యాత్రను ప్లాన్ చేసారు. సమీక్షలు..సమావేశాలు ఏర్పాటు చేసారు. అయితే, జగన్ పార్టీ అధినేత..సీఎం అభ్యర్దిగా హామీలు ఇచ్చారు. దాదాపుగా అమలు చేస్తున్నారు.

పార్టీకి మేలు చేసేనా :లోకేష్ ఇచ్చే హామీలు పొత్తులతో ఎన్నికలకు వెళ్లే వేళ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. కడప జిల్లాలో లోకేష్ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.లోకేష్ హామీలు ఇస్తున్నా..వాటి అమలు బాధ్యత ఎవరనేది ఇప్పుడు ప్రశ్న.
పార్టీ అధినేతగా చంద్రబాబు మినహా టీడీపీలో ఎవరూ హామీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకేష్ ఇస్తున్న హామీల పైన పార్టీలోనూ ఇధే చర్చ సాగుతోంది. అటు సంక్షేమం హామీలు..ఇటు పాదయాత్ర హామీలు..మరో వైపు పొత్తు పెట్టుకున్న పార్టీల డిమాండ్లతో ఎన్నికల వేళ ఇబ్బంది కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..లోకేష్ పాదయాత్ర పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications