21 సీట్లతో రాజీపడలేదు, అసలు లక్ష్యం - పవన్ కీలక వ్యాఖ్యలు..!!
డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ జరిగిన సభలో ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. రాష్ట్ర భవిష్యత్కు కొత్త దిశను చూపిన చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.
తిరుపతిలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో పవన్ కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రజలకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. జనసేన పార్టీ కేవలం 21 సీట్లకే పరిమితమైందంటూ విమర్శలు చేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు తాము చేసిన రాజకీయ త్యాగమే కూటమి విజయానికి పునాది అయిందని అన్నారు. గ్రామమే దేశ అభివృద్ధికి కేంద్ర బిందువని పేర్కొన్న పవన్.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు గ్రామ పంచాయతీల స్థాయిలోనే జరగాలని అన్నారు. గ్రామంలో పరిష్కరించాల్సిన సమస్యలు మండల, జిల్లా లేదా ఎమ్మెల్యే స్థాయికి వెళ్లకుండా స్థానికంగానే పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రతి చిన్న సమస్య కూడా ఎమ్మెల్యేల వద్దకు వెళ్తోందని, రాష్ట్రంలో ఉన్న వందలాది స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను బలహీనపరిచి, మొత్తం వ్యవస్థను ఎమ్మెల్యేల చుట్టూ కేంద్రీకరించడం సరికాదని చెప్పారు.

హామీల అమలు దిశగా అడుగులు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమిష్టి ప్రయత్నాలు ఫలించాయని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజా తీర్పు ఒక తరం భవిష్యత్కు నమ్మకాన్ని ఇచ్చిందని, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్, ఉపాధి అవకాశాల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నా సరైన సమయంలో తమ తీర్పుతో చరిత్రను మార్చగలరని 2024 ఎన్నికలు మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితమని పవన్ అభిప్రాయపడ్డారు. అధికారం పంచుకోవడం కోసం కాకుండా బాధ్యతను పంచుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications