AP Rain Alert: రేపు అల్పపీడనం- ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన..!
ఈ ఏడాది రుతుపవనాల రాక తర్వాత కూడా ఎల్ నినో పరిస్ధితుల కారణంగా వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, ఇతర వర్గాలకు మరో గుడ్ న్యూస్. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి అల్పపీడనంగా మారబోతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని (AP Rain Alert) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ద (ఏపీఎస్డీఎంఏ) ఇవాళ ప్రకటించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.

అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచిస్తోంది. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో దాదాపుగా కోస్తా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అల్పపీడనం కూడా తోడయితే రాబోయే రెండు, మూడు రోజుల పాటు మంచి వర్షాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఇప్పటికే ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో వర్షపాత లోటు 39 శాతానికి చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇబ్బందుల పాలవవుతున్న రైతులకు అండగా ఉండేందుకు పలు చర్యలు కూాడా ప్రకటిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో వర్షపాతం ఆశించిన దానికంటే మెరుగ్గా ఉందని తాజా రిపోర్ట్ ఇచ్చింది. ఎల్ నినో పరిస్దితులు త్వరలో ముదిరే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రెండు వారాల పాటు వర్షాలు ఆశించవచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇవన్ని చూసుకుంటే రైతులకు ఇవన్నీ మంచి రోజులుగా పరిగణించవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.














Click it and Unblock the Notifications