ఏపీలో అందరి నోళ్లూ మూతపడ్డాయా..ఏంటీ: మేధావులు ఎటు పోయారు?
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. గుజరాత్లో 10 లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పేపర్లను అమ్ముకున్నారంటూ వార్తలు రావడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 1,563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలవడం వంటి వివాదాలు నీట్ పరీక్షలను చుట్టుముట్టాయి.
నీట్ కౌన్సెలింగ్ను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు వేగంగా సంభవిస్తోన్నాయి. కౌన్సెలింగ్ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నీట్- పీజీ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. మళ్లీ ఎప్పుడు వీటిని నిర్వహిస్తారనేది ఇప్పటికిప్పుడు వెల్లడించలేదు. కొత్త తేదీని ఇంకా నిర్ధారించలేదు.
నీట్ పేపర్ లీక్, ఉన్నట్టుండి పీజీ పరీక్షల వాయిదా వంటి వ్యవహారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. మేధావులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పౌర సంఘాలు, విద్యార్థి యూనియన్ల ప్రతినిధులు.. చివరికి సాధారణ ప్రజలు సైతం ఈ తతంగంపై ఉద్యమిస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిపై భగ్గుమంటోన్నారు.
తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో విద్యార్థులు రోడ్డెక్కారు. ఆందోళనలు చేపట్టారు. అధికార కాంగ్రెస్, దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు కొద్దిరోజులుగా. కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఇంటినీ ముట్టడించిన విషయం తెలిసిందే.
ఏపీలో మాత్రం ఉలుకు పలుకు ఉండట్లేదు. రోజులు గడుస్తున్నా గానీ ఏ ఒక్కరు కూడా నీట్పై స్పందించట్లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. ఒక్క నిరసన ప్రదర్శన కూడా ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి.
ఏపీలో వేల సంఖ్యలో నీట్ పరీక్షలు రాయదలిచిన విద్యార్థులు ఉన్నారు. వారికి మద్దతుగా ఏ ఒక్కరూ గొంతెత్తట్లేదు. తమకు పట్టని వ్యవహారంగా భావిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సైతం దీనిపై నోరు మెదపట్లేదు.
ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం, ఇతరత్రా రాజకీయ కారణాలతో టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించలేదని అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నీట్ ఉదంతంపై మాట్లాడకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్పో బెటర్ అనిపించుకుంది. ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల రెండు రోజుల కిందటే ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications