స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ ట్విస్ట్..పోలింగ్ ఎప్పుడంటే..?అభ్యర్థులకు కొత్త టెన్షన్
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగనట్లేనా..? కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతనే నిర్వహిస్తామని కొత్త ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అప్పటి ఎస్ఈసీ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ ప్రారంభించారు. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆరువారాల గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ఎన్నికల నిర్వహణపై తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

స్థానిక సంస్థలు మరోసారి వాయిదా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల మరోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటం మరోవైపు ఎన్నికల కమిషనర్ తొలగింపు ఇంకోవైపు పంచాయతీ భవనాలకు వైసీపీ రంగుల వ్యవహారం వివాదాస్పదం కావడంతో అవి తేలేవరకు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఆరువారాలు ఎన్నికలు వాయిదా వేస్తూ నాటి ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారానికే కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రమేష్ కుమార్ను తొలగించింది. దీనిపైన ప్రస్తుతం హైకోర్టులో కేసు కొనసాగుతోంది.

పంచాయతీ భవనాలకు రంగుల వ్యవహారం
ఇదే సమయంలో పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడం పైనా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక ఎన్నికల్లోగా రంగులు తొలగించాల్సిందేనని తొలుత హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే ప్రభుత్వం కొత్త జీఓ ద్వారా వైసీపీ రంగులు కాదు అంటూ ఒక్కో రంగుకు ఒక్కో విశ్లేషణ చేసింది. గతంలో ఉన్న వాటికి అదనంగా మట్టి రంగును జోడించింది. కానీ హైకోర్టు ఆ జీవోను సైతం కొట్టివేసింది. ఇక ఇప్పుడు రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై గురువారం హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. సరిగ్గా ఈ సమయంలో కొత్త ఎన్నికల కమిషనర్ కనగరాజన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ప్రస్తావించిన పలు అంశాలు ఆసక్తికరంగా మారాయి.
Recommended Video

ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే..
ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా వేసిన అంశంతో పాటుగా పంచాయతీ కార్యాలయాలకు రంగుల తొలగింపు అంశాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో వైసీపీ తొలినుంచి ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికల వాయిదా సమయంలో రాష్ట్రప్రభుత్వంతో సంప్రదింపులు జరగలేదని ఆ తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారనే విషయాన్ని తాజా నోటిఫికేషన్లో పేర్కొనడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కరోనా తీవ్రతను ప్రస్తావిస్తూ పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ తిరిగి కొనసాగుతుందని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అయితే ఎప్పట్లోగ జరిగే అవకాశం ఉందనేది మాత్రం స్పష్టత రాలేదు. లాక్డౌన్ మినహాయింపులు క్రమేణా పెరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణపైన త్వరలోనే నిర్ణయం వస్తుందని పోటీలో ఉన్న అభ్యర్థులు ఆశించారు. కానీ తాజాగా ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనలతో వారిలో కొత్త ఆందోళన కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications