అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుంది!
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. దర్శనం కోసం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న స్పీకర్ కు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ్మినేని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
దర్శనమైన తర్వాత స్పీకర్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విషయం ఏమైందని అడగ్గానే మీడియాపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందని, నీకు, నాకు పనేంటంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి పూట గడవడం కోసం పని పాటలేక ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందని, అవినాష్ రెడ్డి పాత్ర ఉంటే సీబీఐ తేలుస్తుందన్నారు. నీకు చెప్పాలా? నువ్వేమైనా సీబీఐ చీఫ్వా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి గోల చేస్తున్నారని, తాను స్వయంగా సభ్యుల విధివిధానాలు చెబితే తప్ప వారికి బాధ్యతలు తెలియడంలేదన్నారు. ప్రభుత్వ తప్పులుంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని, నారా లోకేష్కు సరిగా మాట్లాడటమే రాదని, నిన్న కూడా యువగళం పాదయాత్రలో మీ ఉత్సహం చూస్తుంటే 2019 ఫలితాలే పునరావృతం అవుతాయన్నారంటూ గుర్తుచేశారు. అదే నిజం కాబోతోందని, వైసీపీ 2024లో గెలుస్తుందని, గడప గడపకు తిరుగుతున్న వ్యక్తిగా చెబుతున్నానన్నారు. 2024లో పూర్తి మెజార్టీతో 175కి 175 స్థానాలు గెలుస్తామని తమ్మినేని స్పష్టంగా చెప్పారు.
ఆముదాల వలస నియోజకవర్గం నుంచి ఆరుసార్లు తమ్మినేని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన సమీప బంధువు రవికుమార్ తో విభేదాల నేపథ్యంలో టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీకి మారారు. 2012లో టీడీపీలో చేరినా పార్టీలో సర్దుకుపోలేకపోయారు. 2013లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఓటమి పాలైనప్పటికీ 2019 ఎన్నికల్లో విజయం సాధించి స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications