జగన్ ఢిల్లీ పర్యటనతో కీలక పరిణామాలు: మోడీ సర్కార్ సానుకూలం: కేంద్ర బృందంతో ఏపీ కమిటీ భేటీ
అమరావతి: రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఎదుర్కొంటోన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రానికి కేటాయించిన పెండింగ్ నిధులు మొదలుకుని- తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించింది. వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఇటీవలే- విభజన అంశాలు, పూర్తి కావాల్సిన పంపకాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం అయ్యారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, సోమేష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా మరో కీలక భేటీ ఇవ్వాళ ఏర్పాటు కానుంది. రాష్ట్రం ఎదుర్కొంటోన్న సమస్యలపై సమగ్ర వివరాలను తెలుసుకోవడానికి.. వాటిని పరిష్కరించడానికి అవసరమైన సిఫారసులను అందజేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సీనియర్ ఐఎఎస్ అధికారులతో ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీతో ఇవ్వాళ భేటీ కానుంది.

దేశ రాజధానిలోని ఏపీ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. పోలవరం సహా పలు కీలక అంశాలపై ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. ప్రధానమంత్రి కార్యాలయం నియమించిన బృందంలో- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు దేబాశీష్ పండా, అజయ్ సేథ్, జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్. ఆహార భద్రత- ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీలో- ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికా వలవేన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచాలను ఆమోదించడం, జాతీయ ఉపాధి హామీ పథకం, జీఎస్టీ సహా వేర్వేరు పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయడం, కొత్త ప్రాజెక్టుల కేటాయింపులు.. వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి.
వైఎస్ జగన్ కొద్దిరోజుల కిందటే రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రం ఎదుర్కొంటోన్న సమస్యల గురించి వివరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన భేటీ అయ్యారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహకారం గురించి విజ్ఞప్తి చేశారు. దీని తరువాతే- ఆయన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. అజయ్ సేథ్ సారథ్యంలో కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications