బాబుదే, ఇలాగైతే అది బెస్ట్: రాజధానిపై పి నారాయణ
హైదరాబాద్: విజయవాడ - గుంటూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధిశాఖా మంత్రి డాక్టర్ పి నారాయణ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, రాజధానికి సంబంధించి తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటారన్నారు.
అయితే ఇంతవరకూ జరిగిన సమీక్షలో రాష్ట్రానికి సంబంధించి కేంద్ర స్థానంగా విజయవాడ ఉందన్నారు. కర్నూలు, కడప, అనంతపురం పట్టణాల నుండి నాలుగు లేన్ల రోడ్లతో విజయవాడను కలపగలిగితే రాజధానిగా సరైన ప్రాంతం విజయవాడ అవుతుందని అన్నారు.
రాజధాని నిర్మాణంలో రాజీ పడేది లేదని, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కన్సల్టెంట్లతో మాట్లాడుతున్నామని, వారందరి సలహాల మేరకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెంట్లను కూడా సంప్రదిస్తున్నామని, గుంటూరు, కృష్ణ జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడి సమీక్షించామన్నారు.
రాష్ట్రంలోని అన్ని పట్టణాలను తీర్చిదిద్దుతామని కొన్నింటిని మెగా సిటీలుగా, మరికొన్నింటిని స్మార్టు సిటీలుగా అభివృద్ధి చేస్తామని, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణ సైతం ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి అధికారులతో సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారని మంత్రి చెప్పారు. తాగునీరు, డ్రైనేజీ సమస్య, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, పేదల మురికి వాడల నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.