ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆ నగరం నుంచే ప్రారంభం
ఏపీలో అధికారంలోకి వస్తే తాము అమలు చేయబోయే పథకాలను ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పింఛన్ల పెంపుపై చేశారు. రెండో సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపై, మూడో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. సూపర్ సిక్స్ కింద ప్రకటించినవాటిని దశలవారీగా అమలు చేసుకుంటూ వస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంది.
అధ్యయం చేసి నివేదిక రూపొందిస్తాం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే అవకాశంపై ఈ పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణల్లో తమ అధికారుల బృందం పరిశీలిస్తుందన్నారు. అనంతరం నివేదిక అందిస్తారని, దీనిపై అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

విశాఖ నుంచే ప్రారంభిస్తాం
ఈ పథకాన్ని ముందుగా రాష్ట్రంలో విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం విషయం గత ముఖ్యమంత్రి జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. సంస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయకుండా వదిలేశారని, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామన్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు.
అన్నింటినీ బయటపెడతాం
రాష్ట్రంలో వైఎస్ జగన్ తర్వాత రాష్ట్రాన్ని ఎక్కువగా దోచుకుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ధ్వజమెత్తారు. 1985-90లో పెద్దిరెడ్డిది సామాన్య కుటుంబం అని, ఇప్పుడు వేల కోట్ల రూపాయలు కూడబెట్టారని, రాష్ట్రంలోని గనులు, ఖనిజాలను పెద్దిరెడ్డి తవ్వేశారని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications