ముదురుతున్న పవర్ వార్ : సాగర్, శ్రీశైలం, పులిచింతల డ్యాం, పవర్ ప్లాంట్స్ వద్ద భారీగా పోలీస్ బలగాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజు రోజుకీ ముదురుతోంది. మొదట రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పంచాయతీ మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెల దోపిడీకి పాల్పడుతోందని నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు ఏపీ మంత్రుల పైన, ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రుల పైన ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల శక్తి శాఖకు వరుస లేఖాస్త్రాలు సంధిస్తూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్
సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం అన్న ధోరణిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా మంత్రులు చెప్తుంటే, తెలంగాణ మంత్రులు మాత్రం నీళ్ల దొంగలు, గజదొంగలు అంటూ వైయస్సార్ ను, సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అసహనానికి కారణంగా మారుతుంది. మరోపక్క తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంత ప్రజలు ఉండటంతో ఏదైనా సీరియస్ స్టెప్ తీసుకుంటే వారికి ఇబ్బంది కలుగుతుందేమో అన్న కోణంలో కూడా జగన్ ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణా వాటర్ బోర్డుకు లేఖ రాసిన ఏపీ
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ జెన్ కో ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని దాన్ని నిలుపుదల చేయాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి పేరుతో లేఖ రాశారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ అనుమతి లేకుండా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని తక్షణం ఆపాలని విజ్ఞప్తి చేశారు.

కృష్ణా బేసిన్ జలాశయాల వద్ద భారీ బందోబస్తు
వాటర్ వార్ కాస్త పవర్ వార్ గా మారడంతో తెలంగాణ సర్కార్ చర్యలకు దిగింది.ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ నాగార్జునసాగర్ జలాశయం వద్ద, శ్రీశైలం జలాశయం వద్ద, అలాగే సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయం వద్ద కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. కృష్ణా బేసిన్ లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ డ్యాం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు మినహా ఎవరిని పవర్ హౌస్ లోకి పంపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద భారీ బలగాలు
ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 100 మంది ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్, రిజర్వు బలగాలు ప్రాజెక్టు వద్ద పహారా కాస్తున్నాయి. ఇక నాగార్జున సాగర్ లో ప్రస్తుత నీటి మట్టం 176.2 టిఎంసిలు ఉంది . శ్రీశైలం నుంచి 31 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతూ 8 యూనిట్ల ద్వారా 660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తాజా జల జగడం నేపథ్యంలో పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

పులిచింతల వద్ద కూడా బందోబస్తు, శ్రీశైలం పవర్ ప్లాంట్ వద్ద బలగాలు
ఇదే సమయంలో సాగర్ కు దిగువన ఉన్న పులిచింతల జలాశయం వద్ద కూడా సూర్యాపేట పోలీసులతో పాటు ప్రత్యేక దళాలు మోహరించి పహారా కాస్తున్నాయి.మరోవైపు శ్రీశైలం డ్యాం వద్ద కూడా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకున్న తెలంగాణ పోలీసులు శ్రీశైలం జలాశయం ఎడమ గేటు వద్ద భారీగా మోహరించి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ప్లాంట్ లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపిస్తున్నారు.

వేడెక్కిన వాటర్ వార్ .. కేంద్రం ఏం చేస్తుందో ?
మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అనుమతి లేకుండా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వాటర్ వార్ కాస్త వేడెక్కింది. ప్రస్తుతం అది పవర్ వార్ గా మారడంతో ముందు ముందు ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరి మీద ఒకరి ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్న తరుణంలో కేంద్రం ఈ విషయంలో ఏం చేస్తుంది అన్నది ఆసక్తి కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications