AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన- జిల్లాల వారీగా- తాజా అలర్ట్..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత తీవ్రమవుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావం వల్ల అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అలాగే కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వీటితో పాటు పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో వర్షాలతోపాటు 50-60కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాబట్టి స్థానికంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో చెట్లు , భారీ హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడరాదని సూచిస్తోంది.
మరోవైపు దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం నేపథ్యంలో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది.
ఇవాళ, రేపు విస్తృతంగా వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత కోరారు. అల్పపీడన పరిస్థితులపై అధికారులుతో ఎప్పటికప్పుడు హోంమంత్రి అనిత సమీక్షిస్తున్నారు. ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు.















Click it and Unblock the Notifications
