Weather Update: నిప్పులు కురిపిస్తున్న భానుడు.40 డిగ్రీలకు చేరువలో సెగలు!
ఆంధ్రప్రదేశ్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కడప, అనంతపురంలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రతలు 38°C నుండి 40°C వరకు రికార్డయ్యాయి, ఇది సాధారణం కంటే ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎండతో పాటు ఉక్కపోత, వేడి గాలులు ఒక్కసారిగా తోడవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల చెమటలు ఎక్కువగా పడుతూ నీరసానికి గురిచేస్తున్నాయి. చలికాలం ముగియగానే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో విద్యుత్ వినియోగం కూడా అమాంతం పెరిగింది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ జన సంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి.

Weather Update: సెగలు కక్కుతున్న భానుడు
ప్రాంతంతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎండల సెగలు వ్యాపించాయి. విశాఖపట్నం, కాకినాడ వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉండగా, కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటేశాయి. వేడి గాలుల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ మరియు వైరల్ జ్వరాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొని ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications