AP Weather: ఏపీలో మరో మూడు రోజులపాటు ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొద్ది రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య కొనసాగుతూ, ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశవైపు వంగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది రాగల 12 గంటలలో ఒడిస్సా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఏర్పడింది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు, దక్షిణ కోస్తా ఆంధ్రాలో కూడా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సోమవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమలో కూడా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది ఇలావుండగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వచ్చే రెండు మూడు రోజులు మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములుమెరుపులతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోనూ వర్షాలతోపాటు చలిగాలులు వీయనున్నాయని తెలిపింది. ఉరుములుమెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.