నరకం: పనికోసం దుబాయ్ వెళ్తే, వ్యభిచారంలోకి దింపారు
హైదరాబాద్: బతుకుదెరువు కోసం ఇద్దరు మహిళలు అరబ్ దేశాలకు వెళ్లారు. పని దొరకకపోగా వ్యభిచార కూపంలో చిక్కుకున్నారు. చివరకు అనారోగ్యం వారిని కాపాడింది. చాంద్రాయణగుట్ట పోలీసుల చొరవతో వారు హైదరాబాదుకు తిరిగి వచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన బాధితురాలు, ఆమె చిన్నాన్న కూతురు, వరుసకు సోదరి అయిన మరో బాధితురాలికి ఇటీవల వివాహం అయింది.
వారు బార్కాస్లోని ఓ ప్రాంతంలో ఉంటున్నారు. మొదటి బాధితురాలి ఇంటి వద్ద నివసించే ఓ మహిళ దుబాయికి వెళ్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పింది. దీంతో తన సోదరిని దుబాయికి పంపిస్తే ఆమె జీవితం బాగుపడుతుందని అక్క భావించింది. సలాలా ప్రాంతంలో ఉన్న దళారీ మహిళ, ఆమె కొడుకు ఇంతియాజ్లను సంప్రదించింది.
అయితే వారు అక్కాచెల్లెళ్లు ఇద్దరు వెళ్లవచ్చు కదా అన్నారు. దీంతో వారు అంగీకరించారు. ఆమె చెల్లెలు సరేనంది. అబుదాబి వెళ్లడానికి మొత్తం ఒక్కొక్కరి నుండి రూ.40వేలు వసూలు చేసి ఇంటిలో పని మనుషులకిచ్చే వీసా పైన ఇద్దరిని గత నెల 19న అబుదాబికి పంపించారు.
అబుదబిలో వారికి చేదు అనుభవం ఎదురైంది. వారిని వ్యభిచార కూపంలోకి నెట్టారు. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో డిసెంబర్ 1న హైదరాబాదుకు పంపించారని అక్క చెప్పింది. తన చెల్లెలితో మాట్లాడనిచ్చే వారు కాదని, దీంతో దళారిని కలిసి డబ్బులు ఇచ్చామని చెప్పింది.
నగరం నుంచి వెళ్లే మహిళలను అరబ్ షేకుల ఇళ్లల్లో పెట్టి వ్యభిచారం చేయించేవాడని ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేసేవాడని తెలిపారు. అబుదాబిలో ఎంతో మంది మహిళలు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. పని పేరుతో తీసుకెళ్ళి వ్యభిచారం చేయిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
కాగా, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని దక్షిణమండలం డీసీపీ సత్యనారాయణ సూచించారు. విదేశాలకు వెళ్లే వారు తమకు వచ్చిన వీసాను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే వెళ్లాలన్నారు.