గుజరాత్లో ఎపి కూలీల మృతి: తొక్కిసలాటలో..
శ్రీకాకుళం/ గుంటూరు: గుజరాత్ రాష్ట్రంలోని గాంధీగాంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలానికి చెందిన వలస కూలీలు ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులు, స్థానికులకు వివరాలు అందాయి.
మామిడిపల్లికి చెందిన జుత్తు జయరాం, ధర్మరాజు, బారువకు చెందిన మురళీ, పాలవలసకు చెందిన టి.లోకనాథం, గొల్లకండికి చెందిన హరిబాబులు గుజరాత్లోని గాంధీగాంలో కర్రలమిల్లులో పనిచేస్తూ కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. ఆదివారం రాత్రి వీరంతా విధులు ముగించుకుని హోటల్ భోజనం చేసి బయటకు వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొని జయరాం, లోకనాథం, మురళీలు అక్కడికక్కడే మృతిచెందారు. హరిబాబు, ధర్మరాజుకు తీవ్రగాయాలయ్యాయి.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక భక్తురాలు మృతి చెందింది. కార్తీక సోమవారం పంచారామాలను దర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన అల్లూరి పార్వతి(55) తన కుమార్తెతోపాటు సోమవారం తెల్లవారుజామున అమరావతి చేరుకుని కృష్ణానదిలో స్నానమాచరించింది.
అనంతరం కార్తీక దీపారాదన చేసుకుని స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వుండగా భక్తుల రద్దీ పెరగడంతో తట్టుకోలేక కిందపడిపోయింది. వెంటనే అమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ సంఘటనతో అక్కడ విషాద వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications