చంద్రబాబు కంచుకోటకు బీటలు- కుప్పంలో టీడీపీ అడ్రస్ గల్లంతు : 4 మండలాల్లో వైసీపీ జయకేతనం..!!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన సొంత జిల్లా..సొంత నియోజకవర్గంలో వైసీపీ దుమ్ము రేపుతోంది. కుప్పంలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభం తప్పలేదు. కుప్పం మండలంలో 17 ఎంపీటీసీల్లో వైయస్ఆర్సీపీ విజయం సాధించగా, 2 ఎంపీటీసీలకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది. చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.

కుప్పంలో ఫ్యాన్ హవాతో టీడీపీ గల్లంతు
టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను .. 841కి ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను కైవసం చేసుకుని వైఎస్సార్సీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

నాలుగు మండలాల్లోనూ వైసీపీ విజయం
కుప్పం పరిధిలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్సీపీకి 17, టీడీపీకి 2 దక్కాయి. ఇక, గుడిపల్లె మండలంలో లో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా వైసీపీ గెలిచింది. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచిన వైయస్సార్సీపీ విజయ బావుటా ఎగుర వేసింది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్సీపీ, 1 చోట టీడీపీ గెలిచాయి. మరో 6 చోట్ల రావాల్సిన ఫలితాలు రావాల్సి ఉంది.

మొన్న పంచాయితీల్లో..ఇప్పుడు మండలాల్లో
ఇక, ఇదే బాటలో జడ్పీటీసీల ఫలితాల సరళి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం చవి చూసిసంది. నాలుగు మండలాల్లో 89 పంచాయతీల్లో 75 చోట్ల వైయస్సార్సీపీ, 14 చోట్ల టీడీపీ గెలువగా.. కుప్పం నియోజకవర్గంలో 85శాతానికిపైగా పంచాయతీల్లో వైయస్సార్సీపీ గెలిచి రికార్డు సాధించింది. ఇవన్నీ బోగస్ ఫలితాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు నిరసనగానే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

మంత్రి పెద్దిరెడ్డి స్పెషల్ ఫోకస్ తో..
అయితే, చిత్తూరు జిల్లాలో కుప్పం నియోకవర్గం పైన మాత్రం వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో..పంచాయితీ ఎన్నికల్లో..ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ చంద్రాబును దెబ్బ తీయాలని డిసైడ్ అయింది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ వ్యూహాలు ఫలించి విజయం సాధించటంతో.. వైసీపీ దీనిని ప్రధానాస్త్రంగా మలచుకొని టీడీపీ..వ్యక్తిగతంగా చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications