APPSC: ఏపీపీఎస్సీ మూడు నోటిఫికేషన్లు- 3 శాఖల్లో ఉద్యోగాలివే..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మూడు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నోటిఫికేషన్లలో ఈ ఉద్యోగాలకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇతర వివరాలు ఉన్నాయి.
ఇవాళ ఏపీపీఎస్సీ విడుదల చేసిన 3 నోటిఫికేషన్లలో ఒకటి వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి కాగా.. మరొకటి దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇంకొకటి భూగర్భ జల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉంది. ఈ మూడు కేటగిరీల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తేదీలు, ఇతర వివరాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది.

వ్యవసాయశాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు గడువు ఇచ్చారు. అలాగే దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు గడువు ఇచ్చారు. అలాగే భూగర్భజల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు సమయం ఇచ్చారు. అన్ని ఉద్యోగాలకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం అభ్యర్ధులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్లను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications