బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరుగా.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

ఆ తరువాత మళ్లీ రుతు పవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా- ఎండ తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడిగాలులూ వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. నడివేసవి పరిస్థితులను చవి చూశారు.
ఇప్పుడీ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
మిగతా జిల్లాలు- గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు కావచ్చు.
బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేసింది విపత్తు నిర్వహణ సంస్థ. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని కోరింది.












Click it and Unblock the Notifications