ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత. మార్చురీలోనే భౌతికకాయం?
తెలుగు చిత్రసీమలో తనదైన నటనతో ఐదు దశాబ్దాలకు పైగా అలరించిన సీనియర్ నటి, హాస్య పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామల (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
గుంటూరు జిల్లాలోని అమరావతి గ్రామంలో 1951లో 'నేతి శ్యామల'గా ఆమె జన్మించారు. చిన్నతనంలోనే మాతృమూర్తిని కోల్పోయి, ఎన్నో కష్టాల మధ్య పదో తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్నతనం నుంచే నటనపై ఉన్న అభిరుచితో నాటకరంగంలోకి అడుగుపెట్టి, వేదికలపై తన ప్రతిభను చాటుకున్నారు. ఆ అనుభవంతోనే తదనంతరం వెండితెరకు పరిచయమయ్యారు.

పావలా' శ్యామలగా సినీ ప్రస్థానం...
1985లో వచ్చిన 'బాబాయ్ అబ్బాయ్' చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన శ్యామల, కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన 'స్వర్ణకమలం'లో సహాయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన 'ఖడ్గం' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమాలో ఆమె చేసిన 'పావలా' పాత్ర ఎంతగా పాపులర్ అయిందో, అదే ఆమె ఇంటిపేరుగా మారి 'పావలా శ్యామల'గా ప్రేక్షకుల్లో నిలిచిపోయేలా చేసింది.
'గోలీమార్'తో తిరుగులేని ఇమేజ్!
గోపీచంద్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'గోలీమార్' చిత్రంలో పావలా శ్యామల చేసిన పాత్ర ఆమె కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఇందులో ఆమె చెప్పిన సంభాషణలు, చూపించిన హావభావాలు, నటనలోని టైమింగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. ఈ సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. సుమారు 250కి పైగా చిత్రాల్లో నటించి, తన ప్రత్యేక శైలితో టాలీవుడ్లో చెరగని ముద్ర వేశారు.
అవసాన దశలో కన్నీటి గాథ...
వెండితెరపై కోట్లాది మందికి నవ్వులు పంచిన ఆ మహానటి వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో విషాదభరితంగా సాగింది. జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఆమెను కుంగదీశాయి. కుమార్తె అనారోగ్యం, సరైన ఆదాయం లేక తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు సాయి దుర్గాతేజ్, నిర్మాత దిల్ రాజుతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచారు.
కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ వెండితెరపై మెరిసిన పావలా శ్యామల నిష్క్రమణ తెలుగు చిత్రసీమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.














Click it and Unblock the Notifications