రేపే గురు పూర్ణిమ: 56 ఏళ్ల తర్వాత- డోంట్ మిస్: ఈ పనులు చేయండి చాలు
భారతీయ సంప్రదాయంలో గురు పౌర్ణమికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే గురువులను పూజించే పవిత్రమైన రోజే.. ఈ గురు పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఈ నెల 29వ తేదీన బుధవారం నాడు రానుంది.
పంచాంగం ప్రకారం ఆషాఢ మాస పూర్ణిమ తిథి బుధవారం నాడు వస్తోంది. ఈ సాయంత్రం 6: 18 నిమిషాలకు పూర్ణిమ తిథి ప్రారంభమౌతుంది. మరుసటి రోజు రాత్రి 8: 05 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం 29వ తేదీ నాడే దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించనున్నారు. 56 సంవత్సరాల తరువాత గురు పూర్ణిమ నాడు శష, హంస, బుధాదిత్య రాజయోగం సంభవించబోతోంది.

గురు పౌర్ణమి రోజున పవిత్ర నదీ స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో శుభకరం. తెల్లవారు జామున 4: 17 నిమిషాల నుంచి 4: 59 నిమిషాల వరకు స్నానాలు, దానాలు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం.
మహాభారతం, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలను రచించిన వేద వ్యాస మహర్షి ఆషాఢ పూర్ణిమ నాడే జన్మించారు. సనాతన ధర్మంలో వేదాలను నాలుగు భాగాలుగా వర్గీకరించిన మొదటి గురువుగా వ్యాసుడిని భావిస్తారు. అందుకే ఈ పర్వదినాన్ని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున గురువులను పూజించి, వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ నశించి, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
సనాతన ధర్మంలో గురువు స్థానం దైవంతో సమానంగా భావిస్తారు. గురు అనే పదంలో గు అంటే అంధకారం, రు అంటే వెలుగు అని అర్థం. అంటే.. మనలో ఉన్న అజ్ఞాన దీపాన్ని హరించి, జ్ఞాన దీప్తిని వెలిగించేవాడే గురువు. గురువు అనుగ్రహం లేనిదే దైవ సాధన కూడా అసంపూర్ణంగానే మిగిలిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామునే లేచి స్నానాదికాలు ముగించుకోవాలి.
ఇంట్లో పూజా మందిరంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వ్యాస మహర్షి విగ్రహాలు లేదా చిత్రపటాల ముందు దీపారాధన చేయాలి. ప్రత్యక్షంగా గురువులు అందుబాటులో ఉంటే, వారి పాదాలకు నమస్కరించి రక్షా బంధనం కట్టడం, చందనం, పూలతో అలంకరించి పూజించడం ఆనవాయితీ.
శిష్యులు తమ శక్తి సామర్థ్యాల మేరకు గురువులకు వస్త్రాలు, పండ్లు, దక్షిణాదులను సమర్పించి వారి దీవెనలు పొందడం మంచిది. ఒకవేళ తమ గురువులు అందుబాటులో లేకపోతే, వారి ఫొటోను ఎదురుగా ఉంచుకుని మానసికంగా ధ్యానం చేసుకుంటూ పూజించవచ్చు. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ జీవిత మార్గదర్శకులను స్మరించుకుని, వారి దారిలో నడవడానికి సంకల్పం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications