అటు ఎండలు..ఇటు వర్షాలు - రుతుపవనాలపై ప్రకటన..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు ఎండలు దంచి కొడుతుంటే..మరో వైపు వర్షాల పైన అలర్ట్స్ వస్తున్నాయి. కొద్ది రోజులుగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతలు..వడగాల్పులతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. బయటకు రావటానికే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఆకస్మికంగా వర్షాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే నైరుతి రుతుపవనాల పైన వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
కొనసాగుతున్న ద్రోణి: ఏపీలో వర్షాలపైన విపత్తుల నిర్వహణ శాఖ తాజా సమాచారం ఇచ్చింది. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ రోజు (ఆదివారం) అనకాపల్లి,అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరో వైపు ఎండలు కొనసాగుతున్నాయి.

తేలికపాటి వర్షాలు: దీంతో పాటుగా సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. రోహిణి కార్తెకు ముందే ఎండల తీవ్రత కారణంగా ఇదే సమయంలో ఉష్ణోగ్రతలకు సంబంధించి అలర్ట్స్ వస్తున్నాయి. ద్రోణి కారణంగా ప్రస్తుతం పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నా.. ఎండలు తగ్గటం లేదు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలను దాటి ఎండ తీవ్రత నమోదు అవుతోంది. తాజాగా రానున్న రెండు రోజుల్లో మరిన్ని మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని అంచనా వేసారు.

రుతుపవనాల రాకపై: ఎండ తీవ్రత పెరుగుతున్న సమయంలో రుతుపవనాలు ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు బులెటిన్ విడుదల చేసింది వాతావరణ శాఖ. జూన్ 4 నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. జూన్ 4 -7 మధ్య కేరళను తాకి.. అక్కడి నుంచి మెల్లగా మన దగ్గరికి రావడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దీని ప్రభావంతో తెలంగాణలో మూడు నాలుగు రోజుల్లో ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications