ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్: 40 శాతం బకాయిలు విడుదల: విలీనంపైన నేడు కీలక నిర్ణయం..!
ఒక వైపు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణీలకు పైన భారం మోపుతూనే..కార్మికులకు చెల్లించాల్సిన 40 శాతం బకాయిల చెల్లింపుకు నిర్ణయం జరిగింది. ఆర్టీసీ సిబ్బంది సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 40 శాతం బకాయిలను విడుదల చేసింది. ఈ నెల 12న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆ మొత్తం జమ అవుతుందని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.మ్మడి రాష్ట్రంలో వేతన సవరణకు సంబంధించిన బకాయిలను 2013 తర్వాత చెల్లించలేదు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బాండ్లు జారీ చేసి పదవీ విరమణ సమయంలో ఇస్తామని అప్పట్లో యాజమాన్యం చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్ఎంయూ దీనిపై యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతూ వచ్చింది. తమకు ఇచ్చిన బాండ్లు రద్దు చేసి నగదు చెల్లించాలని డిమాండ్ చేసింది.

రేపు కార్మికుల ఖాతాల్లోకి నగదు
కార్మికుల డిమాండ్ల మేరకు విడతలవారీగా చెల్లించేందుకు అంగీకరించిన యాజమాన్యం.. గత ఏడాది జూలై నాటికి 60శాతం చెల్లించింది. ఆ తర్వాత గుర్తింపులోకి వచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ మిగతా 40శాతం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తూ సమ్మెకు సిద్ధమైంది. సెప్టెంబరులో చెల్లిస్తామని చెప్పిన యాజమాన్యం, ఆ బకాయిలను ఇప్పుడు విడుదల చేసింది. జేఏసీతో చేసుకున్న ఒప్పందం మేరకు సమైక్యాంధ్ర సమ్మె లీవులు, యూనిఫామ్, సీసీఎస్ లోన్లు అన్నీ ఈ నెల 20లోపు ఇచ్చేందుకు ఎండీ కృష్ణబాబు అంగీకరించినట్లు పలిశెట్టి దామోదర్ రావు మరో ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా ఉన్న కొన్ని సాంకేతిక సమస్యల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది.
విలీనంపై నేటి కేబినెట్లో చర్చ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే సమయం దగ్గర పడుతుండటంతో ఈ అంశంపై ఏపీ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం చర్చించనుంది. సంస్థ కాకుండా సిబ్బంది వరకే విలీనం చేస్తున్న నేపథ్యంలో పాత పెన్షన్ ఇవ్వాలని కార్మిక సంఘాలు ఇటీవల కృష్ణబాబు నేతృత్వంలోని కమిటీకి లిఖితపూర్వకంగా తెలిపాయి. అయితే పాత పెన్షన్ ఇవ్వడమనేది ఆర్థికంగా భారమని, సీపీఎ్సకు అవకాశమివ్వొచ్చని కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు జనవరి నుండి ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా గుర్తించేలా నిర్ణయం తీసుకుంది. సంస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయటానికి సాంకేతిక సమస్యలు ఉన్నా..ముందుగా ఉద్యోగులను విలీనం చేయాలని నిర్ణయించింది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ తీసుకోబోయే నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిలో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications