తుఫాను వేళ ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల రద్దు - కీలక సూచనలు..!!
మొంథా తుఫాను ఉగ్రరూపం దాల్చుతుంది. తీరానికి సమీపిస్తున్న వేళ మరింత ప్రచండ గాలుల తో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంత జిల్లాలకు బిగ్ అలర్ట్స్ జారీ అయ్యాయి. తుఫాను ప్రభావం రవాణా వ్యవస్థ పైనా పడింది. పెద్ద సంఖ్యలో రైళ్లు.. విమానాలు రద్దు చేసారు. తుఫాను వేళ.. ఆర్టీసీ సేవల కొనసాగింపు పైన ఉన్నతాధికారులు సమీక్ష చేసారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో అదనపు సిబ్బందిని మొహరించారు. ప్రయాణీకులకు పలు సూచనలు చేసారు.
మొంథా తుఫాను ప్రభావం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రాత్రికి కాకినాడ - తుని సమీపంలో తుఫాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నారు. సౌండ్ అలర్ట్స్ తో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా పలు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేసారు. దక్షిణ మధ్య రైల్వే 72 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖ, విజయవాడ, రాజమండ్రి నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. ఈ మూడు రోజుల పాటు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. దీంతో.. తుఫాను సమయంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు.. సంసిద్దత పైన ఉన్నతాధికారులు సమీక్ష చేసారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు.

తుఫాను దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ అప్రమత్తమైంది. వేగంగా ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎండీ దిశానిర్దేశం చేశారు. పరిస్ధితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆదేశించారు. ఎక్కడా ప్రమాదాలకు తావివ్వకుండా బస్సులు నడపాలని ప్రయాణికుల రద్దీ మేరకు మాత్రమే దూరప్రాంత బస్సులు నడపాలని సూచించారు. రద్దీ లేని ప్రాంతాలకు అవసరమైతే సర్వీసులు నిలిపివేయాలని ఎండీ సూచించారు. వంతెనలు, రోడ్లపై వాగులు, ప్రవహించే ప్రాంతాలకు బస్సులు నిలిపివేయాలని నిర్దేశించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల వినతి మేరకు వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని అలానే బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications