ఉచిత బస్సు నడవాలంటే..! సర్కార్ కు తేల్చేసిన ఆర్టీసీ యూనియన్..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు పథకం స్త్రీశక్తిని ఈ ఏడాది ఆగస్టు 15న ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఎప్పటికప్పుడు ఈ పథకానికి లభిస్తున్న ఆదరణపై ప్రభుత్వం గణాంకాలు కూడా విడుదల చేస్తోంది. గతంతో పోలిస్తే మహిళల ప్రయాణాలు రెట్టింపు అయ్యాయని చెబుతోంది. అయితే ఈ పరిస్ధితి మున్ముందు కొనసాగాలంటే తీసుకోవాల్సిన చర్యల్ని మాత్రం తీసుకోవడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
స్త్రీశక్తి పధకం భవిష్యత్ లో ఇంకా విజయవంతమై ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే ఇప్పుడు బస్సులు సంఖ్య సరిపోవడం లేదని, కాబట్టి వెంటనే 3 వేల ఆర్టీసి బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఈయూ నేతలు కోరారు. అలాగే సిబ్బంది కొరతతో ప్రతిరోజు సిబ్బంది డబుల్ డ్యూటీలు చేయాల్సివస్తున్నందున అన్నికేటగిరీల్లో సుమారు 10 వేల మంది సిబ్బంది నియామకాలు చేయకపోతే వచ్చే వేసవి నాటికి చాలా మంది కండక్టర్లు డ్రైవర్లు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.

మరోవైపు ప్రభుత్వం నుండి ఈ మేరకు అనుమతులు ఇప్పించేలా చూడాలని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి ఉద్యోగ సంఘం నేతలు కోరారు. అలాగే ప్రభుత్వ పరీశీలనలో ఉన్న ఆర్టీసిలో పదవీవిరమణ చేసిన ఉద్యోగుల ఆర్ఈఎంఎస్ స్కీమ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రస్తుతం విధులలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి 10 గ్రీవెన్సులు ఉన్నాయని వాటన్నింటిని పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేసారు.
అలాగే స్త్రీ శక్తి పథకం రాయితీ డబ్బులు ప్రతినెలా ప్రభుత్వం ఆర్టీసికీ చెల్లించేలా చూడాలని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఇవ్వాల్సిన స్త్రీ శక్తి రాయితీ డబ్బులు సుమారు రూ. 360 కోట్లు వెంటనే ఆర్టీసికీ చెల్లించేలా చూడాలని కోరారు. లేదంటే బస్సుల నిర్వాహణ కష్టమవుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలన్నారు.

అలాగే గత ఆరేళ్లలో వివిధ కారణాలతో పనిష్ మెంట్ల సడలింపు అనుమతుల కోసం ఆర్టీసీ ఎండీ ప్రభుత్వ అనుమతులకు పంపించగా క్రింది స్దాయిలో అన్ని అనుమతులు పొంది చివరకు ఆగస్టు 28న సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. అయినా ఇంకా జీవో రాకపోవడం, ప్రస్తుతం పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సుమారు 6 వేల మంది ఉద్యోగులేకాకుండా భవిష్యత్ లో పదోన్నతులకోసం ఆశపడేవారిలో ఆర్టీసి లో పనిచేస్తున్న 45 వేలమంది ఉద్యోగులు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. దీని వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications