కొత్త ఏడాది కానుకను ప్రకటించిన జగన్ ప్రభుత్వం: జనవరి 1 నుంచి వారి వేతనాలు పెంపు..
APSRTC: వేలాదిమంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. కొత్త ఏడాది కానుకను ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా కొత్త వేతనాలను వారికి చెల్లించనుంది. దీనికి అవసరమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది.
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కారించే దిశగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్లను కలిపి చెల్లించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రజా రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల అలవెన్సుల చెల్లింపులో జాప్యం ఏర్పడుతూ వచ్చింది. 2017 నాటీ పేరివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్కు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో ఆలస్యం చోటు చేసుకుంది.
ఇప్పుడు వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ వైఎస్ జగన్ ఆదేశాలను జారీ చేశారు. ఆయా అలవెన్సులన్నింటినీ కూడా ఇకపై జీతంతో పాటే చెల్లించాలని సూచించారు. 2017 పీఆర్సీ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దశలవారీగా విడుదల చేయనుంది.
ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు తమ సమస్యలు పరిష్కరించినందున ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ సర్కార్ గుర్తించిందని రానున్న రోజులు ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications