ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త- అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు పెంపు...
ఏపీలో లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో గతంలో విధించిన ఆర్టీసీ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతకు ముందు నెల రోజులుగా ఉన్న ఈ గడువును ప్రభుత్వం వారం రోజులకు తగ్గించింది. కరోనా వ్యాప్తి కారణంగా బస్సు సర్వీసుల్లో కోత విధించడం, రోజువారీ సర్వీసుల ఎంపిక కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని వల్ల టికెట్ బుకింగ్స్ కోసం చివరి నిమిషం వరకూ ప్రయాణికులు ఎదురుచూడాల్సిన పరిస్ధితి.
దీంతో తాజాగా ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్స్ గడువును వారం రోజుల నుంచి తిరిగి నెల రోజులకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల మరింత ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ టికెట్లను ముందుగా బుక్ చేసుకునేందుకు అవకాశం కలగనుంది. మరోవైపు అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం విధించడంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా సీరియస్ అయిన నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణపై అధికారులు కీలక చర్చలు జరుపుతున్నారు. ఇందులో తెలంగాణకు అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవి కూడా ప్రారంభమైతే ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఆదాయం కాస్త పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సర్వీసులు కుదించిన అధికారులు.. ఇప్పుడు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించి బస్సులు నడుపుతున్నారు. త్వరలో ఈ ఆంక్షలన్నీ తొలగించేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.