జైట్లీ మీడియా సమావేశం డ్రాప్: ఏపీకి కేంద్రం ఇచ్చే 'ప్రత్యేక' ప్యాకేజీ ఇదీ
అమరావతి: హోదాకు ధీటుగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం రూ. లక్షా 50వేల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించనుంది. ఏపీకి ఇస్తున్న ప్యాకేజీపై ప్రకటన చేసేందుకు రాత్రి 8 గంటలకు జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో ఆ ప్రెస్ మీట్ వాయిదా పడింది.
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో పాటు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కూడా పాల్గొంటారని తొలుత వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కు సురేశ్ ప్రభు రైల్వే జోన్ ప్రకటిస్తారంటూ వార్తలు వచ్చాయి. హోదాకు మించి ఏపీకి కేంద్రం సాయం చేస్తుందని అరుణ్ జైట్లీ చెబుతున్న నేపథ్యంలో ఆయన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.
ఏపీకి ప్రకటించే ప్యాకేజీకి ఆర్థికశాఖ తుది మెరుగులు దిద్దుతోంది. అయితే ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ప్యాకేజీపై రూపొందించిన డ్రాఫ్ట్ పీఎంఓ నుంచి ఆర్ధిక శాఖకు రావాల్సి ఉంది. ఆర్ధిక శాఖకు వచ్చిన డ్రాఫ్ట్ను మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపిస్తారు.

ప్యాకేజీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి కేంద్రం ముందు ఉంచుతారు. ఈ భారీ ప్యాకేజీకి చంద్రబాబు సంతృప్తి చెంది, సమ్మతం తెలిపితేనే అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు విజయవాడలో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీకి కేంద్రం రూ. లక్షా 50వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించనుందని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, సురేశ్ ప్రభు, నిర్మాల సీతారామన్ల సమక్షంలో ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కేంద్రం ప్రకటించనున్న లక్షా 50వేల కోట్ల భారీ ప్యాకేజీలో పోలవరం ప్రాజెక్టుకు రూ. 28 వేల కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
అదే విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. అదే విధంగా ఏపీకి ఇప్పటి వరకు కేటాయించిన 25 విద్యాసంస్ధలకు గాను రూ. 5 వేల కోట్లను కేటాయించారు.
రూ. లక్షా 50వేల కోట్లతో ఏపీకి భారీ ప్యాకేజీ?
* పోలవరానికి రూ. 28 వేల కోట్లు
* వెనుకబడిన ప్రాంతాలకు రూ. 2 వేల కోట్లు
* రాజధాని అమరావతికి రూ. 10 వేల కోట్లు
* విద్యాసంస్థలకు రూ. 5వేల కోట్లు
* పోర్టుల అభివృద్ధి కోసం 20 వేల కోట్లు
* జాతీయ రహదారుల అభివృద్ధికి 25 వేల కోట్లు
* ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల కోసం 30 వేల కోట్లు
* రెవెన్యూ లోటుభర్తీకి 10 వేల కోట్లు












Click it and Unblock the Notifications