ప్రజలకి అశోక్బాబు హామీ: అననివ్వండి, రాజ్యసభకు నో
హైదరాబాద్: వచ్చే ఏడాది కూడా సమైక్య రాష్ట్రంలోనే గణతంత్ర వేడుకలు జరుపుకుంటామని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు ఆదివారం అన్నారు. ఎపిఎన్జీవో కార్యాలయంలోని గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది సమైక్య రాష్ట్రంలోనే వేడుకలు జరుగుతాయని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
రాష్ట్ర సమైక్యతను కాపాడేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను తాము చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రం విడిపోదన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యయుతంగా వేర్పాటువాదుల ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు పని చేస్తున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరు సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. కాగా, రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన తనకు లేదని, ఉద్యోగుల సంఘాన్ని వదిలి వెళ్లనని అశోక్ బాబు శనివారం స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పక్షాలు మిమ్మల్ని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నాయని విలేకరులు ప్రశ్నించగా... అననివ్వండి చూద్దామని చెప్పారు. అయితే, తనకు రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదన్నారు.
కాగా, తనపై దాడి జరుగుతుందన్న అనుమానంతోనే ఈ నెల 22న జరిగిన చలో హైదరాబాద్కు భారీ భద్రత ఏర్పాటు చేశారన్నారు. ఎపిఎన్జీఓ హోంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు శాసనసభ సమావేశాలను మరో నెల రోజులపాటు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లుపై ప్రతి ఎమ్మెల్యే మాట్లాడాల్సి ఉన్నందున అది అనివార్యమన్నారు.