జగన్ పార్టీ పట్టుతో స్తంభించిన సభ: వాయిదా
హైదరాబాద్: కార్యక్రమాలేవీ చేపట్టకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ రేపటికి వాయిదా వడింది. శాంతిభద్రతలపై తక్షణ చర్చకు పట్టుబడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దాంతో రెండు సార్లు సభను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు 15 నిమిషాల చొప్పున వాయిదా వేశారు. మూడో సారి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఆయన సభను మంగళవారంనాటికి వాయిదా వేశారు.
శాంతిభద్రతలపై తక్షణమే చర్చను చేపట్టాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో శాసనసభా సమావేశాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సోమవారం సభ సమావేశం కాగానే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాంతిభద్రతలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయం తీసుకుందామని చెప్పారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తమ పట్టు వీడలేదు. శాంతిభద్రతలపై తక్షణం చర్చ జరపాల్సిందేనంటూ స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. తగిన విధంగా ముందుకు వస్తే శాంతిభద్రతలపై చర్చకు సభలో చర్చకు అనుమతి ఇస్తానని స్పీకర్ చెప్పినా వారు వినలేదు. సభా కార్యక్రమాలను స్తంభింపజేయడం సరికాదని సూచించారు.
శాంతిభద్రతల సమస్యపై జీరో అవర్లో ప్రస్తావించాలని కూడా స్పీకర్ చెప్పారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితి చోటు చేసుకోవడం స్పకీర్ సభను వాయిదా వేశారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపించింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణల్లో నిజం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభా సమావేశాలు 15 నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 19 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎక్కడెక్కడ చనిపోయారని ఆయన అడిగారు.
రైతు సమస్యలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పట్టడం లేదని మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శించారు. సభా సమయాన్ని ఆ పార్టీ సభ్యులు వృధా చేస్తున్నారని ఆయన విమర్శించారు.