టీపై ఏకాభిప్రాయం రాలేదు: బాబు, సోనియాపై ఫైర్
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై శాసనసభ సంప్రదింపులు తప్పనిసరి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతకు ముందు అన్ని రాష్ట్రాలు శాసనసభల తీర్మానాలతోనే ఏర్పడ్డాయని ఆయన అన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకిస్తే ఆయనకు నచ్చజెప్పిన తర్వాత శాసనసభ తీర్మానంతోనే ఏర్పాటు చేశారని చంద్రబాబు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
హైదరాబాద్, ఆంధ్ర శాసనసభల తీర్మానాలతోనే విలీనం జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేసారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి భారత చరిత్ర, సంప్రదాయాలు తెలియవని ఆయన విమర్శించారు. సోనియా గాంధీ ఇటలీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సోనియాకు మన భాష, ప్రజల మనోభావాలు అర్థం కావని ఆయన అన్నారు.
తెలంగాణపై విస్తృతమైన ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పడంలో నిజం లేదని అన్నారు. ఢిల్లీలో కూర్చుని కలలు కంటే జివోఎం ఏకాభిప్రాయమా అని ఆయన అడిగారు. రాజ్యాంగంలోని వివిధ భాగాలను ఆయన చదివి వినిపించారు. సర్కారియా కమిషన్ ఏం చెప్పిందో కూడా వివరించారు.
గతంలో మద్రాసు నుంచి విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కమిటీలు, కమిషన్లు వేశారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఏ ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేశారని ఆయన అడిగారు.