ఎన్టీఆర్ పేరు చెప్పి నిప్పులు: రూల్స్ మార్చిన బాబు, జగన్ మరోసారి చిత్తు!
హైదరాబాద్: స్పీకర్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పైన మంగళవారం నాడు వాడిగా వేడిగా చర్చ జరిగింది. చర్చకు ముందే అధికార ప్రతిపక్షాలు వాగ్యుద్ధానికి దిగాయి. ఆ తర్వాత స్పీకర్ పైన అవిశ్వాసంపై చర్చ ప్రారంభమైంది.
అంతకుముందు, జగన్ మాట్లాడుతూ... స్పీకర్ పైన అవిశ్వాసం ఇచ్చిన 14 రోజుల తర్వాత చర్చ జరగాలన్నారు. సభ్యులకు విప్ జారీ చేసేందుకు 14 రోజుల సమయం ఇవాలని రూల్ ఉందన్నారు. ప్రజలు తమకు ఓటేస్తారని నమ్మకం లేకే తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సిగ్గు, శరం ఉంటే..
పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు స్పీకర్ కుర్చీని వాడుకుంటున్నారన్నారు. మీకు సిగ్గు, శరం ఉంటే పార్టీ మారిన వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. రూల్స్ కాపాడాల్సిన వ్యక్తులే ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. మీరు ప్రజాస్వామ్యవాదులా అని జగన్ ప్రశ్నించారు.
స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానానికి 14 రోజుల గడువు ఉన్నప్పటికీ తొందర ఎందుకని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలన్నారు. వారు మా పార్టీ బీఫాం పైన గెలిచారన్నారు.
యనమల మాట్లాడుతూ.. స్పీకర్ పైన పదేపదే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యం వైసిపి వారి వద్ద ఉందో లేదో మాకు తెలియదని ఎద్దేవా చేసారు. నోటీస్ ఇవ్వడం పారిపోవడం ప్రతిపక్ష నేతకు అలవాటయిపోయిందని విమర్శించారు.
సంతకమే పెట్టలేదు
జగన్ నిన్నటి నోటీసులో (అవిశ్వాస తీర్మానం) సంతకం పెట్టలేదని, నేటి నోటీసులోను (స్పీకర్ పైన అవిశ్వాసం) సంతకం పెట్టలేదని యనమల విమర్శించారు. నోటీసులపై సంతకం పెట్టకుండా ఇవ్వడమేమిటన్నారు. పైగా ఇచ్చిన ఆ నోటీసు పై నిన్నటి తేదీ వేసి, ఇవాళ ఇచ్చారన్నారు.
సొంత మామకు వెన్నుపోటు
జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు గురించి అందరికీ తెలుసు అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన వారిని కాపాడటం సరికాదన్నారు. అవినీతి సొమ్ముతో వారిని కొనుగోలు చేశారన్నారు. ప్రలోభాలు పెట్టి పార్టీలో చేర్చుకున్నారన్నారు.
సొంతమామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడన్నారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలన్నారు. యనమల మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని జగన్ చెబుతున్నారని, కానీ వాళ్లు ఎందుకు వెళ్లిపోతున్నారో చెప్పాలన్నారు.
రూల్స్ మార్చిన ప్రభుత్వం!
వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, టిడిపిలో చేరిపోయిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటింపజేయాలన్న వైసిపి జగన్ ఎత్తులు మరోసారి చిత్తయ్యాయి. సోమవారం అవిశ్వాస తీర్మానం ఇవ్వగా, ఆ వెంటనే చర్చను చేపట్టి, విప్ జారీ చేసే సమయం కూడా ఇవ్వని చంద్రబాబు సర్కారు, నేడు స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సందర్భంగా అసెంబ్లీ రూల్స్ను మార్చింది.
స్పీకర్ పై అవిశ్వాసాన్ని పెడితే కనీసం 14 రోజుల తర్వాత చర్చను జరపాలని నిబంధనల్లో స్పష్టంగా ఉన్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. తమ సభ్యులకు విప్ జారీ చేసే సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై యనమల స్పందించారు. ఆ నిబంధన ఉన్న రూల్స్ను తొలగిస్తున్నట్టు తీర్మానాన్ని ప్రతిపాదించారు. మూజువాణీ ఓటుతో ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో జగన్ అవాక్కయ్యారు.
అంతకుముందు యనమల మాట్లాడుతూ.. రూల్స్ మాకు తెలియనివి కావని, అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అని, ప్రతిపక్ష నేత మరోసారి చేతులు కాల్చుకుంటున్నారని, రూల్ 358 కింద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఆసెంబ్లీ, ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతోందని, రూల్ 71-2, రూల్ 72-3లను సస్పెండ్ చేయాలని కోరుతున్నానని చెప్పారు.
ఈ తీర్మానం ఆమోదం పొందిందని, జగన్ ప్రస్తావించిన రూల్స్ వర్తించవని స్పీకర్ కోడెల స్పష్టం చేశారు. దీనిపై వైసిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై యనమల స్పందిస్తూ.. సభ సజావుగా సాగేలా చూసేందుకు ఎలాంటి రూల్స్నైనా మార్చే అధికారం సభకు ఉందని, ఆయన ఏ రూల్స్ అయితే ప్రస్తావించారో అవి చెల్లవని, అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరగాలని, కనీసం రెండు గంటలు కేటాయిస్తారని భావిస్తున్నామని, రాజకీయంగా చూస్తే, మీరు నోటీసు ఇచ్చారని, దానికి కట్టుబడి ఉండాలన్నారు. చర్చిద్దామంటే వెనక్కు ఎందుకు పారిపోతున్నారు? వద్దని ఎందుకంటున్నారు? మీకెందుకు బాధ అని ప్రశ్నించారు.